జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ రిక్రూట్మెంట్కు 25 వేల మంది: గందరగోళం, లాఠీచార్జీ
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని రియాసి జిల్లాలో భారత సైన్యం శనివారం నాడు నిర్వహించిన రిక్రూట్మెంట్ ర్యాలీలో గందరగోళం నెలకొంది. 1300 సైనిక ఉద్యోగాల కోసం ఆర్మీ రియాసీ పట్టణంలో నియామక శిబిరం ఏర్పాటు చేసింది. అయితే రియాసి జిల్లాతో పాటుగా పొరుగు జిల్లాల నుంచి కూడా యువకులు ఆర్మీ శిభిరానికి చేరుకున్నారు.
మొత్తం 25 వేల మంది యువకులు రావడంతో ఆర్మీ అధికారులు వారి వివరాలు సేకరించి పలువురిని అనర్హులుగా ప్రకటించింది. దీంతో యువకులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు యువకులను చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో విద్యార్థులు మరింత రెచ్చిపోయి ఆర్మీ అధికారులపై రాళ్లు రువ్వారు. రిక్రూట్మెంట్ బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఆర్మీ అధికారులు మాత్రం నోటిఫికేషన్లో వివరాలు సరిగ్గానే ఇచ్చామని, నోటిఫికేషన్ ప్రకారమే అనర్హులను తిరస్కరించామని చెప్పారు.
రియాసీ జిల్లాకు చెందినవారిని నియమించుకోవడానికి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చామని, పొరుగు జిల్లాల నుంచి కూడా రావడంతో వారిని తిరస్కరించామని అధికారులు అంటున్నారు.
శరీర దార్ఢ్య పరీక్షల సందర్బంగా ఓ యువకుడు మృత్యువాత పడినట్లు కూడా తెలుస్తోంది. 1,300 ఉద్యోగాలకు 25 వేల మందికి పైగా హాజరు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.