పీఓకేను ఖాళీ చేయండి: పాక్కి భారత్ స్పష్టం, చైనాకు ధీటైన జవాబు
ఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూ, మద్దతు అందిస్తోందంటూ పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను ఖాళీ చేసి వెళ్లాలంటూ గట్టి హెచ్చరకి పంపింది. పాకిస్థాన్లో భారత్ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టడం, ప్రకటనలు చేయడం, ఉగ్రవాది బుర్హాన్ వాణిని చంపడాన్ని 'బ్లాక్ డే'గా ప్రకటించడం పై భారత్ ఘాటుగా స్పందించింది.
క్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదుల్ని, వారి కార్యకలాపాలకు పాక్ మద్దతు ఇవ్వడాన్ని భారత్ ఖండిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది.
చైనా సరిహద్దుల్లో భారత యుద్ధ ట్యాంకులు: 1962 తర్వాత ఇదే తొలిసారి
సరిహద్దుల్లో దూకుడును ప్రదర్శిస్తున్న చైనాను కట్టడి చేసేందుకు భారత్ దీటుగా జవాబిస్తోంది. తన భూభాగంలోకి తరచూచొచ్చుకొస్తున్న చైనా దళాలను నిలువరించేందుకు 54 ఏళ్ల తర్వాత తొలిసారిగా యుద్ధ ట్యాంకులను మోహరించింది. తూర్పు లడఖ్లో భారత్-చైనా సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఏకంగా వంద టి-72 ట్యాంకులను రంగంలోకి దించింది.
1962లో భారత్-చైనా యుద్ధం సమయంలో ఐదు ట్యాంకులను మాత్రమే భారత్ ఇక్కడ మోహరించింది. గగనతలం నుంచి వీటిని పారాచూట్ల సాయంతో జారవిడిచారు. ప్రతికూల వాతావరణం కారణంగా అప్పట్లో ఇవి సరిగా పనిచేయలేదు. యుద్ధం ముగిశాక భారత్ వాటిని ఉపసంహరించింది.
ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు వాటిని ఇక్కడికి తరలించింది. ప్రస్తుతానికి వంద ట్యాంకులను మోహరించినా.. త్వరలో మరికొన్నింటిని రంగంలోకి దించబోతోంది. పర్వత శ్రేణుల వెంబడి ఉన్న మైదాన లోయలు ఈ సాయుధ శకటాల కదలికకు అనువుగా ఉంటాయి. వీటి రాక వల్ల సరిహద్దుల్లో మన బలం కూడా పెరుగుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఒప్పందాలను గుర్తు చేసిన చైనా
లడఖ్లో యుద్ధ ట్యాంకుల మోహరింపుపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిలు కాంగ్ స్పందించారు. సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతను పరిరక్షించడానికి భారత్, చైనాల మధ్య కుదిరిన ఒప్పందాలు, వ్యక్తమైన ఏకాభిప్రాయాలను రెండు దేశాలు గౌరవించాలన్నారు.
పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించుకోవాలని, సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు కృషి చేయాలని తెలిపారు. మరోపక్క తమ దేశం నుంచి భారత్కు వచ్చే పెట్టుబడులపై తాజా పరిణామం ప్రభావం చూపుతుందని చైనా అధికారిక పత్రిక 'గ్లోబల్ టైమ్స్' హెచ్చరించడం గమనార్హం.