సామరస్యానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: రాజ్నాథ్
న్యూఢిల్లీ: దేశంలో శాంతి, మత సామరస్యానికి విఘాతం కలిగించొద్దని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. దాద్రీలో ముస్లిం వ్యక్తిని కొట్టి చంపడం దురదృష్టకరమని అన్నారు. శాంతికి, మత సామరస్యానికి ఏ వ్యక్తి విఘాతం కలిగించొద్దని కోరారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. మత సామరస్యానికి ఆటంకం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత సామరస్యానికి ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఈ విషయంలో ఆయా రాష్ర్టాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ మతస్థుడి మనోభావాలు దెబ్బ తీయకూడదన్నారు.
మానవ అక్రమ తీవ్రమైన నేరం
దక్షిణాసియాలో మానవ అక్రమ తరలింపు అంతకంతకూ పెరుగుతోందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. మానవ అక్రమ తరలింపు అదుపు చేయడంపై బుధవారం ఢిల్లీ ఏర్పాటు చేసిన సదస్సులో రాజ్నాథ్ పాల్గొని ప్రసంగించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ప్రకారం మానవ అక్రమ తరలింపు తీవ్రమైన నేరమని అన్నారు. భారత్ సహా ప్రపంచ దేశాలను ఈ సమస్య వేధిస్తోందని అన్నారు. ఇది సరిహద్దులు లేకుండా అంతటా విస్తరించిందని చెప్పారు. ఈ సమస్యను రూపుమాపేందుకు సమగ్ర వ్యవస్థను రూపొందిస్తామన్నారు.
మాదకద్రవ్యాలు, నేరాలపై ఐక్యరాజ్యసమితి నివేదికను చూస్తే భయంకర వాస్తవాలు కనిపిస్తాయన్నారు. దక్షిణాసియాలోనే మానవ అక్రమ తరలింపు ఎక్కువగా ఉందని తెలిపారు. ఒక్క ఏడాది కాలంలోనే దక్షిణాసియాలో లక్షన్నర మంది మానవ అక్రమ తరలింపు బాధితులుగా మారారని రాజ్నాథ్ తెలిపారు.