బాయ్ఫ్రెండ్ని కొట్టి, అమ్మాయిపై ఆరుగురు రేప్: అరెస్ట్
పాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రాజధాని పాట్నాకు సమీపంలోని బిహ్తా అనే పట్టణంలో గురువారం ఓ దళిత బాలికపై ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భోజ్పుర్ జిల్లాకు చెందిన ఆ విద్యార్థిని, బిహ్తలో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వెళ్లింది.
అక్కడే ఉంటున్న ఓ స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఆరుగురు యువకులు యువకుడి పైన దాడిచేసి బాలికపై అత్యాచారం చేశారు. అటుగా వచ్చిన ఓ స్థానిక మహిళ జరిగిన దారుణాన్ని గుర్తించి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించింది.
గురువారం నాడు బాధిత బాలిక తన బాయ్ ఫ్రెండ్ను ఓ చిన్న బ్రిడ్జి వద్ద కలిసింది. ఈ సమయంలో ఓ ఆరుగురు గుర్తు తెలియని యువకులు ఆమెను పొదల్లోకి తీసుకు వెళ్లి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఓ మహిళ అప్రమత్తం చేయడంతో గ్రామస్తులు వచ్చి బాలికను ఆసుపత్రికి తరలించారు.
గ్రామస్తులను చూసిన యువకులు పరుగు లంఘించుకున్నారు. వారిలో ఒకరిని పట్టుకున్నారు. దొరికిన వ్యక్తిని దీపక్ కుమార్గా గుర్తించారు. అతనిని పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఆరుగురు నిందితుల్లో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ఇద్దర్ని పట్టుకుంటామని చెప్పారు.
కాగా, సూరత్లో ఘోరం జరిగింది. ఉమర్వాడా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అస్లామ్ షేక్, రాజా విమల నారాయణ్ శేఖర్, సర్ఫరాజ్ షేక్ అనే ముగ్గురు వ్యక్తులు స్థానికంగా ఉండే మహిళను లైంగిక వేధించేవారు. తమ కోరిక తీర్చాలని పదేపదే వెంటపడేవారు.
దీనికి ఆమె అంగీకరించకపోవడంతో గురువారం రాత్రి ఆ మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై, ఆమె కుటుంబ సభ్యులపై యాసిడ్తో దాడి చేశారు. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, పిల్లలకు తీవ్ర గాయాలు, భర్త, అత్తకు సాధారణ గాయాలయ్యాయి. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.