రెండు జడలు వేసుకోలేదని 200 గుంజీళ్లు తీయించారు.. ఎక్కడంటే..
రెండు జడలు వేసుకోకుండా వచ్చినందుకు ఓ చిన్నారికి స్కూలు ప్రిన్సిపల్ 200 గుంజీళ్ల శిక్ష విధించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో మంగళవారం ఈ ఘటన జరిగింది.
అహ్మదాబాద్: స్కూలు నిబంధనల ప్రకారం రెండు జడలు వేసుకోకుండా వచ్చినందుకు ఓ చిన్నారికి స్కూలు ప్రిన్సిపల్ 200 గుంజీళ్ల శిక్ష విధించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో మంగళవారం ఈ ఘటన జరిగింది.
మణినగర్లోని లలిత గ్రీన్లాన్స్ స్కూల్లో హనీ ప్రజాపతి(10) ఐదో తరగతి చదువుతోంది. తల మీద గడ్డ రావడంతో రెండు జడలు వేసుకోలేక పోనీ టెయిల్ వేసుకుని బడికి వచ్చింది.
దీనిపై క్లాస్ టీచరు అభ్యంతరం చెప్పి ఆ చిన్నారిని ప్రిన్సిపల్ దగ్గరకు తీసుకువెళ్లింది. టీచర్ ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. పాప చెప్పేది వినిపించుకోకుండా ప్రిన్సిపల్ ఆ చిన్నారితో 200 గుంజీళ్లు తీయించారు.
కాళ్ల వాపులతో ఏడుస్తూ ఇంటికి వచ్చిన హనీని చూసి ఆమె తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. హనీ తండ్రి ప్రవీణ్ ప్రజాపతి ఓ టీస్టాల్ ఓనర్. జరిగినదంతా హనీ చెప్పడంతో ఆయన ఆగ్రహంతో స్కూలు యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.