సహారా గ్రూప్ చైర్మన్తో ఫొటో, పిఎంను అరెస్టు చేస్తారా: దీదీ ఫైర్
కోల్కతా: ప్రస్తుతం జైలులో ఉన్న సహారా గ్రూప్ చైర్మన్తో ప్రధాని ఫొటోలున్నాయి, అంత మాత్రాన ప్రధానిని అరెస్టు చేస్తారా అని తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) ఆగ్రహం వ్యక్తం చేశారు. శారదా చిట్ఫండ్ కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై రాష్ట్ర మంత్రి మదన్ మిత్రాను సిబిఐ అరెస్టు చేయడంపై ఆమె కేంద్ర ప్రభుత్వంపైనా, బిజెపిపైనా నిప్పులు చెరిగారు. తృణమూల్ ఎంపీలు సోమవారం నుంచి పార్లమెంటులో నిరసన తెలుపుతారని ప్రకటించారు. సిబిఐ తన ప్రతిష్ఠను పూర్తిగా కోల్పోయిందని, అది ‘హిజ్ మాస్టర్స్ వాయిస్'గా మారిపోయిందని అన్నారు. సిబిఐ ఒక రాజకీయ ఆయుధంగా మారిందని,త దాన్ని రద్దు చేయాల్సిన సమయం వచ్చిందని ఆమె అన్నారు.
బిజెపి కక్షసాధింపు రాజకీయాలకు వ్యతిరేకంగా టిఎంసి ఎంపీలు సోమవారంనుంచి పార్లమెంటులో నిరసన తెలియజేస్తారు అని శనివారం మిత్రా అరెస్టుకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో మాట్లాడుతూ మమత అన్నారు. ‘మీ హద్దుల్లో మీరు ఉండండి, లేదంటే ఏం జరుగుతుందో చూడండి' అని ఆమె బిజెపిని, కేంద్రాన్ని హెచ్చరించారు. అధికారంలో ఉన్నారు కాబట్టే బిజెపి వాళ్లు ఇలా హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని అన్నారు.
‘నేను ఓ ముఖ్యమంత్రిగా కాక సామాన్య పౌరురాలిగా ఇక్కడికి వచ్చాను. మిత్రా దొంగ లేదా గజదొంగ అని నేను అనుకోవడం లేదు. తన కుటుంబం గడవడం కోసం ఆయన ఈ డబ్బు (శారదా గ్రూపునుంచి) తీసుకోవలసిన స్థితిలో ఆయన కుటుంబం లేదు' అని మమత అన్నారు.
శారదా గ్రూపు కార్మిక సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆ యూనియన్ అధ్యక్షుడిగా ఉండిన మిత్రా శారదా గ్రూపు చైర్మన్ సుదీప్త సేన్తో కలిసి ఒకే వేదికపై ఉన్న ఫోటోల గురించి మమత ప్రస్తావిస్తూ - ‘ఒక ఫోటో కుట్రకు సాక్ష్యం అయినట్లయితే సహారా గ్రూపు కుంభకోణంలో ప్రధానిని కూడా అరెస్టు చేయాలి. సిపిఎం నేతలు చిట్ఫండ్స్ యజమానులతో ఉన్న ఫోటోలు చాలా వచ్చాయి. సహారా గ్రూపు చైర్మన్తో ప్రధాని ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే ప్రధాని నరేంద్ర మోదీని అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేయాలా?' అని ప్రశ్నించారు.
ఈ కేసులో ఒక సాక్షిగా మిత్రాను సిబిఐ ఆఫీసుకు పిలిచారని, కొన్ని గంటల తర్వాత ఆయనను అరెస్టు చేసారని ఆమె చెబుతూ, ఢిల్లీనుంచి ఫోన్కాల్ వచ్చినందునే ఆయనను అరెస్టు చేసారని ఆరోపించారు. సిబిఐ అధికారులు తనతో మాట్లాడుతున్నారని, మీరు ఏ స్కూల్లో, కాలేజీలో చదివారని మామూలు ప్రశ్నలు అడుగుతున్నారని, ఆ సమయంలోనే ఢిల్లీనుంచి ఓ ఫోన్కాల్ వచ్చిందని, ఆ తర్వాత తనను అరెస్టు చేసారని, అరెస్టు తర్వాత తనను కలిసిన కొడుకుతో మిత్రా చెప్పారని ఆమె అన్నారు. ‘ఒక సాక్షిగా పిలిచిన వ్యక్తిని ఈ తరహాలో అరెస్టు చేస్తే ఎవరు కూడా సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రారు' అని అన్నారు.
బిజెపితో రాజకీయంగానే పోరాడాలని తమ పార్టీ కార్యకర్తలను కోరిన మమత రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి ఆ పార్టీ వాళ్లు ప్రయత్నిస్తున్నారని, అయితే తాము అది సాగనివ్వమని అన్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం వాళ్లను అరెస్టు చేయడం ప్రారంభిస్తే ఏం జరుగుతుందని ప్రశ్నించారు. ప్రజలు వీధుల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని మమత అంటూ పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేయాలని క్రీడాకారులతో సహా అన్ని రంగాలకుచెందిన వారికి పిలుపునిచ్చారు. సిబిఐ అరెస్టు చేసిన కారణంగా మిత్రాను మంత్రివర్గం నుంచి తొలగించేది లేదనిస్పష్టం చేసిన మమత ప్రస్తుతానికి ఆయన నిర్వహించే శాఖలను తానే చూస్తానన్నారు.