చిదంబరంపై మరో బాంబు.. కార్తీ 21 రహస్య ఖాతాలను బయటపెట్టిన స్వామి
కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం మరిన్ని చిక్కుల్లో పడనున్నారు. సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై మరోసారి తన దాడిని ఎక్కుపెట్టారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం మరిన్ని చిక్కుల్లో పడనున్నారు. సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై మరోసారి తన దాడిని ఎక్కుపెట్టారు.
కార్తీ.. అతని కంపెనీలకు సంబంధించిన దాదాపు 21 రహస్య విదేశా బ్యాంకు ఖాతాల వివరాలను బహిర్గతం చేసి చిదంబరం, ఆయన కుటుంబంపై పెద్ద బాంబు పేల్చారు. ఈ వివరాలను మీడియాకు వెల్లడించిన స్వామి తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆదాయపు పన్ను అధికారులు అలక్ష్యం కారణంగానే ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని స్వామి ఆరోపించారు. చిదంబరం కొడుకు కార్తీ కానీ.. అతని పేరెంట్ ఇండియన్ కంపెనీలు కానీ ఈ విదేశీ బా్యంకు ఖాతాల కార్డుల వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులకు వెల్లడించలేదని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా మొనాకో బార్ క్లేస్ బ్యాంక్, కెనడాలోని బ్యాంక్ మెట్రో, సింగపూర్ లోని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఓబీబీసీ, కెనడాలోని హెచ్ఎస్ బీసీ, ఫ్రాన్స్ లోని డాయిష్ బ్యాంక్, స్విట్జర్లాండ్ లోని యూబీఎస్, కాలిఫోర్నియాలోని వెల్స్ ఫార్గో బ్యాంక్ లాంటి విదేశీ బ్యాంకుల ఖాతాలను బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు.
కొన్నేళ్లుగా చిదంబరం కుమారుడు కార్తీ ఈ ఖాతాలను రహస్యంగా నిర్వహిస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఆర్థిక మంత్రిత్వశాఖలోని సన్నిహితులపై చిదంబరం ఒత్తిడి మూలంగానే ఎనిమిది నెలలుగా చెన్నై ఆదాయ పన్ను శాఖ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
2014 ఎన్నికల సందర్భంగా లోక్ సభకు పోటీ చేసిన కార్తీ ఎలక్షన్ కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో ఈ ఖాతాల వివరాలను కూడా ప్రకటించలేదని స్వామి పేర్కొన్నారు. ఈ బ్యాంకు ఖాతాల జాబితా, ఖాతాల నెంబర్లు, గతంలో తాను మోడీకి రాసిన లేఖ, కార్తీ ఆదాయ ప్రకటన వివరాలను ఆయన మీడియాకు అందజేశారు.
ఫిబ్రవరి 16వ తేదీన తాను ప్రధాని నరేంద్రమోడీకి ఒక లేఖ రాశానని, ఎయిర్ సెల్ మాక్సిస్ స్కామ్ పై పలు ఆరోపణలు గుప్పించినా.. చిదంబరం, ఆయన కుమారుడి ప్రమేయంపై తాను సాక్ష్యాలను సమర్పించినా కూడా సీబీఐ, ఈడీ తగిన చర్యలు తీసుకోలేదంటూ మండిపడ్డారు.
కొంతమంది బీజేపీ నాయకులు అవినీతి నిరోధక చట్టాన్ని నీరుగార్చేందకు ప్రయత్నిస్తున్నారని, ఈ చర్యను తాను వ్యతిరేకిస్తున్నానని, దీని అంతు తేలేవరకు తాను పోరాటం సాగిస్తానని స్వామి చెప్పారు. దీనికోసం పార్లమెంట్ లో సవరణలు ప్రతిపాదించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.