సుకేష్ చలాకీ: దినకరన్ను ఇలా పల్టీ కొట్టిచ్చాడు
సుకేష్ చంద్రశేఖర్ చాలా తెలివిగా దినకరన్ను ముగ్గులోకి దింపినట్లు తెలుస్తోంది. తనను తాను న్యాయమూర్తిగా చెప్పుకుని దినకరన్ను పల్టీ కొట్టిచ్చినట్లు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: అన్నాడియంకె అధికారిక చిహ్నం రెండాకులను కేటాయించడానికి లంచం ఇచ్చారనే ఆరోపణలపై టీటీవి దినకరన్ విచారణను ఎదుర్కుంటున్నారు. గత రెండు రోజులుగా ఆయనను అధికారులు గంటల తరబడి విచారించారు. సోమవారం కూడా ఆయనను విచారించే పనిలో పడ్డారు.
విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే మధ్యవర్తిగా వ్యవహరించిన సుకేష్ చంద్రశేఖర్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుకేష్ దినకరన్ను ఎలా మోసం చేశాడనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
తాను హైకోర్టు న్యాయమూర్తినని, పార్టీ 'రెండాకుల' గుర్తును గెలుచుకునేందుకు ఈసీ అధికారులను అంగీకరింపజేస్తానని సుకేశ్ చంద్రశేఖర్ దినకరన్ను నమ్మించినట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 16న చంద్రశేఖర్ను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి 20 గంటల ముందు కూడా దినకరన్ చంద్రశేఖర్తో మాట్లాడినట్టు అధికారులు చెబుతున్నారు.
సుదీర్ఘంగా దినకరన్ విచారణ..
రెండాకుల గుర్తు కోసం లంచం ఇచ్చిన కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులు శనివారం నుంచి దినకరన్ను విచారిస్తున్నారు. శనివారం ఏడుగంటలపాటు ప్రశ్నించారు. ఆదివారం 11 గంటల పాటు ప్రశ్నించారు. ఎంత ప్రశ్నించినప్పటికీ సుకేశ్ చంద్రశేఖర్ తనకు తెలియదనే దినకరన్ చెబుతున్నట్టు తెలుస్తోంది. తాను హైకోర్టు న్యాయమూర్తినని చెప్పడం వల్లనే తాను సుకేష్తో మాట్లాడానని చెప్పినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
మూడో రోజూ దినకరన్ను,..
ఢిల్లీ పోలీసులు వరుసగా మూడోరోజైన సోమవారం కూడా దినకరన్ను ప్రశ్నిస్తున్నారు. సోమవారం సుదీర్ఘంగా విచారించిన పోలీసులు - దినకరన్ ముందు ఆధారాలు పెట్టి మరీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్లు సమాచారం. దినకరన్ను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.
సుకేష్ పట్టుబడడంతోనే వెలుగులోకి..
ఈనెల 16వ తేదీన సుకేశ్ చంద్రశేఖర్ అనే యువకుడు ఢిల్లీ పోలీసులకు పట్టుబడడంతో దినకరన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పార్టీ గుర్తు కోసం మొత్తం రూ.50 కోట్ల మేర డీల్ కుదిరినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఢిల్లీ పోలీసులు చంద్రశేఖర్ వద్ద అరెస్టు సమయంలో రూ.1.3 కోట్ల నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.
కేసుతో తిరగబడిన తమిళ రాజకీయాలు...
లంచం కేసులో దినకరన్ చిక్కుకోవడంతో తమిళ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. పరిస్థితులు జైలులో ఉన్న చిన్నమ్మ శశికళకు, ఆమె మేనల్లుడు దినకరన్కు వ్యతిరేకంగా మారాయి. రాజకీయాల్లో వారి గుర్తులు కూడా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. శశికళ ఆశీస్సులతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన పళనిసామి ఆమెపై తిరుగుబాటు చేసిన పన్నీరు సెల్వంతో రాజీకి చర్చలు చేస్తున్నారు.