సుకుమా విషాదం: మహిళా నక్సలైట్లు.., ఆయుధాలు ఎత్తుకెళ్లారు
ఛత్తీస్గఢ్ సుకమా జిల్లాలో నక్సలైట్లు సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆయుధాలతో విరుచుకు పడి కనీసం 25 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘనటలో నక్సలైట్లు పెద్ద ఎత్తున ఆయుధాలు ఎత్తుకెళ్లారు.
నయా రాయ్పూర్: ఛత్తీస్గఢ్ సుకమా జిల్లాలో నక్సలైట్లు సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆయుధాలతో విరుచుకు పడి కనీసం 25 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘనటలో నక్సలైట్లు పెద్ద ఎత్తున ఆయుధాలు ఎత్తుకెళ్లారు.
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు 22, ఇన్సాస్ రైఫిల్స్ 600 రౌండ్ల బుల్లెట్లు, ఏకె 47 ఆయుధాలు 22, ఏకే 47 మేగనజైన్లు 59, ఎల్ఎంజీ మేగజైన్లు 16.. ఇలా పెద్ద ఎత్తున ఆయుధాలు ఎత్తుకెళ్లారు. సీఆర్పీఎఫ్ జవాన్లు ఎదురు కాల్పులకు దిగేలోపే నక్సలైట్లు విరుచుకు పడి హతమార్చారు.
మావోయిస్టుల ఘాతుకం: ఎన్కౌంటర్లో 25 మంది జవాన్ల మృతి
ఇదిలా ఉండగా, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం రాయపూర్ చేరుకున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు అర్పించారు.
జవాన్ల ప్రాణత్యాగం వృథాగా పోదు: ప్రధాని మోడీ
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు జరిపిన దాడిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖండించారు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇది పిరికిపంద చర్యగా మోడీ అభివర్ణించారు. జవాన్ల త్యాగాలు వృథాగా పోవన్నారు.
పరిస్థితిని క్షుణ్నంగా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. సీఆర్పీఎఫ్ బలగాలు కనపరిచిన శౌర్య పరాక్రమాలు చూసి గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అత్యంత బాధాకరం: రమణ్సింగ్
ఢిల్లీలో ఉన్న సీఎం రమణ్ సింగ్ సుకుమా ఘటన గురించి తెలియగానే తన కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. హుటాహుటిన సొంత రాష్ట్రానికి బయల్దేరి అత్యవసరంగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహంచారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని ఆయనన్నారు.
70 శాతం మంది మహిళలే
ఈ ఘాతుకానికి పాల్పడ్డ మావోయిస్టుల్లో 70 శాతం మంది మహిళలే ఉన్నట్లుగా తెలుస్తోంది. దక్షిణ బస్తర్ ప్రాంతంలోని కాలాపత్తర్ ప్రాంతంలో ఉన్న జవాన్లపై పెద్ద ఎత్తున ఏకే-47, ఇన్సాస్ రైఫిళ్లలాంటి అత్యాధునిక ఆయుధాలతో 300 నుంచి 400 మంది వరకు మావోయిస్టులు వచ్చి దాడికి దిగారని సంబంధిత అధికారులు చెప్పారు.
రోడ్డు వేస్తున్న వారికి రక్షణగా వస్తే..
సీఆర్పీఎఫ్ జవాన్లు అంతా అక్కడి ప్రాంతంలో రోడ్డు వేస్తున వారికి రక్షణగా వచ్చారని, అదే సమయంలో ఈ దాడి జరిగిందని చెప్పారు. తొలుత కూంబింగ్ అని భావించారు. కానీ రోడ్డు వేస్తున్న వారికి రక్షణంగా వచ్చారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి పట్టుంది.
రోడ్డు వేస్తున్న ప్రాంతం కొంత దిగువన ఉండి, ఎగువన గుట్టలు ఉండటంతో పైనుంచి దాడి చేసే మావోయిస్టులకు ఆ గుట్టలు రక్షణగా ఉండి, కింద ఉన్నవాళ్లపై సులభంగా దాడి చేసే అవకాశముంటుంది. చుట్టూరా వచ్చేసిన మావోయిస్టులు హేండ్ గ్రనేడ్లు, ఆటోమేటిక్ రైఫిళ్లు, రాకెట్ లాంచర్లతో దాడులు చేశారని తెలుస్తోంది.