సునంద కేసు: ఆర్థిక కారణాల కోణంలో సిట్ విచారణ, కొచ్చి టస్కర్స్..
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసును ప్రత్యేక దర్యాఫ్తు బృందం విచారిస్తోన్న విషయం తెలిసిందే. సునంద మృతి కేసులో సిట్ ఆర్థిక నేరాల వింగ్ సహాయం కూడా తీసుకోనుందని అంటున్నారు.
ఐపీఎల్ కోణంలోను సిట్ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో సునంద, శశిథరూర్ల ట్రాన్సాక్షన్లను పరిశీలించే అవకాశముందని అంటున్నారు. సునంద మృతి వెనుక ఆర్థిక లావాదేవీలు కూడా ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అవసరమైతే తాము ఆర్థిక నేరాల వింగ్ సహకారం తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
సునంద హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు ఉండే అంశాన్ని కొట్టి పారేయలేమంటున్నారు. ఐపీఎల్ కోణంలో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా లేవా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అవసరమైతే ఐపీఎల్ కోణంలోను పలువురిని విచారిస్తామని సిట్ బృందం చెబుతోంది.
ఇందుకు సంబంధించి 18 పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారిని అవసరమైతే ప్రశ్నిస్తామని సిట్ చెబుతోంది. అయితే, ఈ డబ్బుల విషయంలో పూర్తి స్పష్టత కోసం ఆర్థిక నేరాల వింగ్ను సంప్రదిస్తామని, అనంతరం దీని పైన ముందుకు వెళ్తామని చెబుతున్నారు.
కొచ్చి టస్కర్స్ ఫైనాన్సర్స్ను విచారించవచ్చు
సిట్ బృందం కొచ్చి టస్కర్స్ యజమానుల నుండి ఫైల్స్ కోరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వివాదాల నేపథ్యంలో ఈ టీమ్ కొనసాగని విషయం తెలిసిందే. కొచ్చి టస్కర్స్లో సునంద పుష్కర్కు కూడా వాటాలు ఉన్నాయి. ఆమెకు ఇందులో వాటాను శశిథరూర్ ప్రభావంతో వచ్చినట్లుగా ఆరోపణలు వినిపించాయి.
తాము పలు కోణాల్లో విచారిస్తున్నామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. తాము ఆర్థిక లావాదేవీల కోణంలోను విచారిస్తామని, అవసరమైతే కొచ్చి టస్కర్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చూస్తామని చెప్పారు. కాగా, సీనియర్ విలేకరు నళినీ సింగ్ను సిట్ బృందం శుక్రవారం ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఐపీఎల్, పాక్ జర్నలిస్ట్ మెహర్ తరర్ అంశాలతో తాను మనస్తాపానికి లోనైనట్లు సునంద మృతికి ముందు తనతో చెప్పినట్లు నళినీ చెప్పారు.