సునంద మృతి: అమర్ సింగ్కు 2 గంటల్లో 20 ప్రశ్నలు
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రాజకీయ నేత అమర్సింగ్ను బుధవారంనాడు విచారించింది. సాక్షిగా ఆయనను సిట్ ప్రశ్నించింది. రెండు గంటల పాటు ఆయనను దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. ఆయనకు 20 ప్రశ్నలు వేశారు. విచారణ అనంతరం అమర్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
తాను శశి థరూర్కు వ్యతిరేకం కాదని, వాస్తవాలు వెల్లడి కావాలని తాను కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. సునంద తనకు సన్నిహిత మిత్రురాలని, ఈ కేసులో తనకు తెలిసిన విషయాలన్నీ పోలీసులకు చెప్పానని ఆయన అన్నారు. సిట్ తనకు వేసిన ప్రశ్నలను వెల్లడించడానికి అమర్ సింగ్ నిరాకరించారు. కేసుపై వ్యాఖ్యలు చేయడానికి కూడా ఆయన ఇష్టపడలేదు.
తన ప్రకటన ఇప్పుడు పోలీసు దర్యాప్తులో భాగమైందని, అందువల్ల ఆ విషయంపై తాను ఇప్పుడు ఏమీ మాట్లాడలేనని అయన అన్నారు. ఈ కేసులోని అనుమానాలను పోలీసులు నివృత్తి చేస్తారని ఆయన చెప్పారు. సునంద పుష్కర్, శశి థరూర్ మధ్య గల సంబంధాలపై తనను సిట్ అడిగిందని ఆయన చెప్పారు. సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో సిట్ మరోసారి శశి థరూర్ను ప్రశ్నించే అవకాశం ఉంది.
ఇదిలావుంటే, సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు రాజకీయ నాయకుడు అమర్ సింగ్కు అంతకు ముందు సిట్ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఏ విధమైన సమాచారం ఉందో తెలుసుకోవడానికి తాము అమర్ సింగ్ను ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీసు చీఫ్ బిఎస్ బస్సీ చెప్పారు. మీడియాకు అమర్ సింగ్ కొంత సమాచారం ఇచ్చారని, అమర్ సింగ్ను విచారణకు ఈ రోజే పిలిచామని ఆయన చెప్పారు.
మరణానికి రెండు రోజుల ముందు సునంద పుష్కర్ తనతో మాట్లాడారని, ఐపియల్ వ్యవహారంపై మాట్లాడారని అమర్ సింగ్ చెప్పారు. సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకునేంతు పిరికి మహిళ కాదని కూడా ఆయన అన్నారు. దాంతో అమర్ సింగ్ను సిట్ విచారణకు పిలిచింది. సునంద పుష్కర్ తమను పిలిచినట్లు ఇద్దరు జర్నలిస్టులు కూడా సిట్కు తెలిపారు. ఐపియల్ వ్యవహారాలపై శశి థరూర్ విషయాలు చెప్తానని ఆమె చెప్పినట్లు వారు తెలిపారు