సునంద.. సోనియా అపాయింట్మెంట్ అడిగారేమో! టీవీ యాంకర్ విచారణ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో మరో బాంబు పేల్చారు. సునంద పుష్కర్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింటుమెంట్ అడిగారన్నారు.
సునంద తన మృతికి ముందు సోనియా గాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్తో భేటీ అయ్యారని చెప్పారు.
జనవరి 16వ తేదీన సునంద పుష్కర్ హోటల్ గది నుండి బయటకు వెళ్లారని పోలీసులు నిర్ధారించారని స్వామి అన్నారు. హత్యకు పదకొండు రోజుల ముందు జనవరి ఆరున ఆమె అహ్మద్ పటేల్తో భేటీ అయ్యారని, సోనియా అపాయింటుమెంట్ కచ్చితంగా అడిగి ఉంటారని అన్నారు.
అలాగే పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్తో శశిథరూర్ మూడు రోజుల పాటు దుబాయ్లో ఎందుకు ఉన్నారో పూర్తిగా విచారించాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను స్వామి కోరారు. మెహర్ తరర్తో మూడు రోజులు ఉన్నందున పూర్తిగా విచారించారన్నారు. ఇది పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
కాగా, సునంద మృతి పైన దర్యాఫ్తు చేస్తున్న ప్రత్యేక దర్యాఫ్తు బృందం పలువురు జర్నలిస్టులను విచారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీనియర్ జర్నలిస్టు నళినీ సింగ్ను విచారించారు. అలాగే టెలివిజన్ యాంకర్ రాహుల్ కన్వాల్ను విచారించారు. తాను మృతి చెందే ముందు శశిథరూర్ గురించి చెబుతానని ఆమె చెప్పినట్లుగా విచారణలో వెల్లడైనట్లుగా తెలుస్తోంది.