సునంద కేసు: దుస్తులు తొలగించింది వాళ్లేనా? హడావుడిలో...
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో.. గదిలో నుండి ఆధారాలు తొలగించడానికి సంబంధించి నలుగురి పైన ప్రత్యేక దర్యాఫ్తు బృందం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అలాగే ఆల్ప్రాక్స్ మాత్రలను అక్కడ ఉంచినట్లుగా అనుమానిస్తున్నారు. వాటిని అధిక మోతాదులో ఉపయోగించడం వల్ల ఆమె మృతి చెందిందని చెప్పేందుకు వాటిని అక్కడ పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఆమె మృతి అనంతరం గదిలో నుండి పలు వస్తువులను ఈ నలుగురిలో ఎవరో ఒకరు తీసి ఉంటారని అనుమానిస్తున్నారు. అక్కడి ఆధారాలను రూపుమాపేందుకు వారు అక్కడి నుండి వాటిని తీసి ఉంటారని సిట్ అధికారులు భావిస్తున్నారు.
సునంద మృతి సమయంలో నారాయణ సింగ్, థరూర్ పర్సనల్ అసిస్టెంట్ ఆర్కే శర్మ, కుటుంబ మిత్రుడు సంజయ్ దేవాన్, థరూర్ డ్రైవర్ బజరంగీలు గదికి వచ్చారు.
ఉద్దేశ్యపూర్వకంగానే తొలగించారా
గది నుండి దుస్తులు, షూస్ తదితరాలు ఉద్దేశ్యపూర్వకంగానే మాయం చేసినట్లుగా భావిస్తున్నారు. వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది. ఆమె మృతి అనంతరం పై నలుగురు గదికి వచ్చారని, ఎవరో ఒకరు వాటిని తీసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇందులో ఆమె మృతికి ముందు ఎవరు వెళ్లారనేది విచారణలో తేలుతుందంటున్నారు.
ఆధారాలను తొలగించేందుకు అక్కడి నుండి వస్తువులు తీసే హడావుడిలో గ్లాస్ కూడా పగిలిందని చెబుతున్నారు. ఆ హడావుడిలో గ్లాస్ను క్లియర్ చేయలేదు. ఆ హడావుడిలో వారు ఆ వస్తువులు మాత్రమే తీసుకు వెళ్లారు. వస్తువుల కారణంగా ఏదైనా ఆధారాలు లభించవచ్చునని చెబుతున్నారు.
వస్తువులు తీశారని నిర్ధారించిన హోటల్ సిబ్బంది
పలువురు హోటల్ సిబ్బందిని ప్రత్యేక దర్యాఫ్తు బృందం ప్రశ్నించింది. వారి విచారణలో.. హోటల్ సిబ్బంది వస్తువులు అదృశ్యమైన విషయాన్ని నిర్ధారించారు.
సునంద మృతి చెందక ముందు చివరగా చూసింది నారాయణ సింగ్. విచారణలో తేలిన సమాచారం మేరకు.. రాత్రి ఏడున్నర గంటలకు నారాయణ సింగ్ ఆమెను చూశాడు. అనంతరం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఆమె ఫోన్ కాల్ చేసింది.
ఐపీఎల్ కోణంలో...
ఐపీఎల్ కోణంలోను సీరియస్గా విచారిస్తున్నారు. పలువురిని విచారించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. ఐపీఎల్ కోణంలోను విచారించవలసి ఉందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఐపీఎల్తో టచ్లో ఉన్న పలువురు దుబాయ్లో ఉన్నారని, వారి పైన కూడా దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు.
ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన కొచ్చి టస్కర్స్లో సునందకు కూడా వాటా ఇంది. శశిథరూర్ కారణంగానే ఆమెకు అందులో వాటా ఇచ్చి ఉంటారనే ఆరోపణలు వినిపించాయి. ఏ విషయాన్ని వదలమని, అన్ని కోణాల్లోను దర్యాఫ్తు చేస్తామని సిట్ చెబుతోంది.
కాగా, ఢిల్లీ పోలీసులు పలువురు జర్నలిస్టులను గురువారం నాడు విచారించిన విషయం తెలిసిందే. ఇద్దరు లేడీ జర్నలిస్టులను విచారించారు. సునంద పుష్కర్తో టచ్లో ఉన్న మరో ఎనిమిది మందిని కూడా విచారించనున్నారు.
శశిథరూర్ను కూడా మరోసారి ప్రశ్నించవచ్చు. మొదటిసారి విచారణలో శశిథరూర్ సమాధానాలతో సిట్ పూర్తిగాసంతృప్తిగా లేదని, అందుకే మరోసారి ప్రశ్నించనుందని చెబుతున్నారు. ఐపీఎల్ కోణంలోను శశిథరూర్ను ప్రశ్నించారు. సునంద చనిపోయే ముందు.. నీ పని ఫినిష్ అని సందేశం ఇచ్చిన విషయం తెలిసిందే. దీని గురించి థరూర్ను ప్రశ్నించగా.. ఆమె ఏం చెప్పిందో తనకు తెలియదని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది.
సునంద పుష్కరమ మృతికి ముందు హోటల్ రూం నుండి బయటకు వెళ్లి ఎవరినైనా కలిశారా అనే కోణంలోను ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె హోటల్ నుండి బయటకు వెళ్లినప్పుడు ఒక్కరే లేరు. ఆమె గది నుండి ఓ సమయంలో బయటకు వెళ్లినట్లు సీసీటీవీలో ఉందని తెలుస్తోంది.