మహిళలు పిల్లల్నికనడానికి మాత్రమే: సున్నీ అధిపతి
తిరువనంతపురం: మహిళలు ఎప్పటికీ పురుషులతో సమానం కాలేరని, వారు పిల్లలను కనేందుకు మాత్రమే పనికి వస్తారని సున్నీ నాయకుడు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. లింగ సమానత్వం ఇస్లాం భావనకు వ్యతిరేకమని చెప్పారు.
మహిళలు కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే పనికొస్తారని వ్యాఖ్యానించిన అతను అఖిల భారత సున్నీ జమియ్యాతుల్ ఉలేమా (ఏఐఎస్జేయూ) అధిపతి ఎపి అబూబకెర్ ముస్లియార్. ఇతను ఆదివారం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కోజికోడ్లో ముస్లిం విద్యార్థుల సమాఖ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. లింగ సమానత్వమనే భావన ఇస్లాంకు వ్యతిరేకమన్నారు. స్త్రీలకు మనోబలం, ప్రపంచాన్ని నియంత్రించే శక్తి లేవన్నారు. ఈ రెండూ పురుషులకు మాత్రమే సొంతమన్నారు.
లింగ సమానత్వమనేది ఆచరణ సాధ్యం కానిదని, ఇది ఇస్లాం, మానవతావాదానికి పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. మహిళలు ఎప్పటికీ పురుషులతో సమానం కాలేరన్నారు. వెయ్యిమంది హృదయ శస్త్రచికిత్సా నిపుణుల్లో ఒకరైనా మహిళలు ఉన్నారా అని ప్రశ్నించారు.