లవ్ జిహాదీ: తొలిసారిగా సుప్రీం ముందుకు ఇలాంటి కేసు.. హిందూ-ముస్లిం లవ్?
కేరళలో హిందూ మతానికి చెందిన ఓ మహిళ ఇస్లాం స్వీకరించి ముస్లింను వివాహం చేసుకోవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
న్యూఢిల్లీ: హిందూ మహిళ ఒకరు ఇస్లాం స్వీకరించి ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని లవ్ జిహాదీగా పేర్కొంటూ సుప్రీం కోర్టు ముందుకు ఓ కేసు వచ్చింది. సుప్రీంలో ఇలాంటి కేసు విచారణకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కేరళలో హిందూ మతానికి చెందిన ఓ మహిళ ఇస్లాం స్వీకరించి ముస్లింను వివాహం చేసుకోవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీన్ని లవ్ జిహాదీగా పరిగణించి కేరళ హైకోర్టు వీరి వివాహాన్ని రద్దు చేసింది. భర్తను కలిసేందుకు మహిళకు అనుమతి నిరాకరించింది.
కేరళ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఆమె భర్త సుప్రీంలో సవాల్ చేశారు. 24ఏళ్ల తన భార్య ఏ మతాన్ని స్వీకరించాలి?.. ఎవరిని వివాహం చేసుకోవాలనే విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు ఉందని భర్త కోర్టుకు వివరించారు. లవ్ జిహాదీ కుట్రలో భాగంగానే ఇది జరిగిందన్న కేరళ హైకోర్టు ఉత్తర్వులను పిటిషనర్ తరుపు న్యాయవాదులు కపిల్ సిబల్, ఇందిరా జైసింగ్ తప్పుపట్టారు.
వీరి వివాహాన్ని రద్దు చేయడంతో పాటు సదరు మహిళను తన భర్తతో కలిసేందుకు అనుమతించకపోవడం దురదృష్టకరమన్నారు. బాధిత మహిళ భద్రతపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె మనోభావాలు తెలుసుకునేందుకు కోర్టుకు పిలిపించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ డీవై చంద్రచూడ్ లకు విజ్ఞప్తి చేశారు.
బాధిత మహిళ ఇంటిని పోలీసులను మోహరించి.. ఆమెతో ఎవరిని కలవనివ్వకుండా చేస్తున్నారని న్యాయస్థానానికి వివరించారు. 24గం.ల్లోగా ఆమెను కోర్టు ముందు హాజరుపరిచేలా ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.