ట్వీట్ చేస్తే సుష్మ సాయం.. కానీ, డ్రామా ఆడాడని తేలింది
తాను ఆపదలో ఉన్నానని, ఆదుకోవాలని ఓ వ్యక్తి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్కు ట్వీట్ చేశారు. కానీ అది డ్రామా అని తేలింది. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడ
న్యూఢిల్లీ: తాను ఆపదలో ఉన్నానని, ఆదుకోవాలని ఓ వ్యక్తి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్కు ట్వీట్ చేశారు. కానీ అది డ్రామా అని తేలింది. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సుష్మ వెంటనే స్పందిస్తుంటారు.
తాజాగా ఆమెకు వింత అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి తన సోదరుడు అపహరణకు గురయ్యాడంటూ ఆమెకు ట్వీట్ చేశారు. దీంతో ఎప్పటిలాగే స్పందించి సాయం చేశారు. కానీ తీరా చూస్తే అతను కిడ్నాప్ కాకపోగా నాటకం ఆడినట్లు తెలిసింది.
దాంతో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. భారత్కి చెందిన రాజీవ్ శర్మ అనే వ్యక్తి ట్వీట్ చేస్తూ.. సెర్బియా దేశంలో ఉన్న తన సోదరుడు వినయ్ మహజన్ను కిడ్నాప్నకు గురయ్యాడని, డబ్బివ్వకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు.
చొక్కా లేకుండా ఉన్న ఓ వ్యక్తిని కట్టేసి కొడుతున్నట్లున్న వీడియోను కూడా సుష్మాకు పంపించాడు. ఎప్పటిలాగే వెంటనే స్పందించిన సుష్మా సెర్బియాలో అతని సోదరుడి వివరాలు తెలుసుకున్నారు.
తీరా చూస్తే అతన్ని ఎవరూ కిడ్నాప్ చేయకపోగా అతనే కిడ్నాప్ నాటకం ఆడాడని తెలిసింది. ఈ విషయాన్ని సుష్మ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ.. 'రాజీవ్ నీ సోదరుడు అధికారుల సమక్షంలో క్షేమంగానే ఉన్నాడు. మరో విషయమేంటంటే అతన్ని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. నువ్వు పంపిన వీడియో నకిలీది. మీ తమ్ముడే కిడ్నాప్ అయినట్లు డ్రామా ఆడాడు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏదేమైనా సెర్బియాలో ఉన్న భారత దౌత్యాధికారులతో మాట్లాడాను. మీ తమ్ముడిని మార్చి 25న భారత్కు పంపిస్తామని చెప్పారు' అని ట్వీట్ చేశారు.