కులభూషణ్కు ఉరిశిక్ష మోడీ ప్లాఫ్ షో :ఖర్గే,హిందూస్తాన్ బిడ్డకు అండగా ఉంటాం: సుష్మా
ఉరిశిక్ష విధించిన మేరకు పాక్ గనుక కులభూషణ్ జాదవ్ కు శిక్ష అమలు చేస్తే..అది మోడీ సర్కార్ చేతగాని తనం వల్లే జరిగినట్లు భావించాల్సి వస్తుందని మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు.
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలతో గతేడాది భారతీయ నేవి మాజీ అధికారి కులభూషణ్ను పాక్ అరెస్టు చేయగా.. తాజాగా ఆయనకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ప్రతిపక్ష సభ్యులు కులభూషణ్ ను పాక్ చెర నుంచి విడిపిస్తారా లేక చేతకాదని ఊరుకుంటారా? అని ప్రశ్నించాయి.
అనంతరం కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ప్రతిపక్ష సభ్యులకు సమాధానం చెప్పారు. కులభూషణ్ కు పాక్ ఉరిశిక్ష విధించడాన్ని భారత్ ఖండిస్తోందని సుష్మా అన్నారు. సరైన విచారణ కూడా జరపకుండానే ఉరిశిక్ష విధించాలనుకోవడం దారుణమన్నారు.
కులభూషణ్ హిందూస్తాన్ బిడ్డ:
కులభూషణ్కు భారత్ అండగా నిలబడుతుందని, పాక్ ఆయనపై చేస్తోన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు. సరైన విచారణ, సరైన ఆధారాలు లేకుండానే పాక్ ఉరిశిక్ష విధించడాన్ని సుష్మా తప్పుపట్టారు. పాక్ చేస్తోన్న ఆరోపణలు కుట్రపూరిత అన్నారు. కులభూషణ్ హిందూస్తాన్ బిడ్డ అని ఆయనకు అండగా ఉంటామని సుస్మా స్వరాజ్ తెలిపారు.
న్యాయం చేస్తామన్న రాజ్నాథ్:
గూఢచర్యం ఆరోపణలతో కులభూషణ్ కు పాక్ ఉరిశిక్ష విధించడంతో దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. దీంతో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కులభూషణ్ కు న్యాయం జరిగేలా చూస్తామని ప్రకటించారు. 2016 మార్చిలో ఆయన్ను పాక్ అరెస్టు చేసిందని అన్నారు.
భారత పాస్ పోర్టు ఉంది:
కులభూషణ్ ఎటువంటి గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడలేదని, ఆయన వ్యాపార నిమిత్తం ఇరాన్ వెళ్లారని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. గూఢచర్యం ఆరోపణలపై ఆయనను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. కులభూషణ్ వద్ద పాస్ పోర్టు కూడా ఉందని, అలాంటప్పుడు ఆయన గూఢచారి ఎలా అవుతారని అన్నారు. దీనిపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు.
మోడీ పాక్ పర్యటన ప్లాఫ్ 'షో':
కేంద్రమంత్రులు సుష్మా, రాజ్నాథ్ సింగ్ లు మాట్లాడటం కన్నా ముందు కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జు ఖర్గే కులభూషణ్ విషయంపై కేంద్రాన్ని నిలదీశారు. గూఢచర్యం అని పాక్ ప్రభుత్వం చెబుతుంటే భారత్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.
పాక్ కుట్రలను బట్టి చూస్తే.. గతంలో మోడీ చేసిన పాక్ పర్యటన ప్లాఫ్ షో అని అన్నారు. పాక్ను ఉగ్రదేశంగా ప్రకటించాలని ఖర్గే డిమాండ్ చేశారు.
మోడీ సర్కార్ చేతగానితనమే!:
ఉరిశిక్ష విధించిన మేరకు పాక్ గనుక కులభూషణ్ జాదవ్ కు శిక్ష అమలు చేస్తే..అది మోడీ సర్కార్ చేతగాని తనం వల్లే జరిగినట్లు భావించాల్సి వస్తుందని మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. రాజ్యసభలో ఈ అంశంపై విపక్షాలన్ని ఒక్కటై ప్రభుత్వాన్ని నిలదీశాయి. పార్లమెంట్ మొత్తం జాధవ్ పక్షాన ఉందని కేంద్రమంత్రి అనంతకుమార్ స్పష్టం చేశారు.