దొంగ అనే అనుమానంతో కొట్టి చంపేశారు
గౌహతి: పశువుల దొంగ అనే అనుమానంతో ఒక వ్యక్తిని అతి దారుణంగా కొట్టి చంపేసిన సంఘటన అసోంలో జరిగింది. డ్రైవర్ ను హత్య చేసిన కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
జుంటి ఆలీ అలియాస్ ఆలీ ( డ్రైవర్) అనే వ్యక్తి సోమవారం వేకువ జామున రెండు గంటల సమయంలో ఒక వాహనంలో ఆరు ఆవులను తీసుకుని బయలుదేరాడు. మార్గం మధ్యలో గోలగడ్ జిల్లా సరిహద్దులోని జాతీయ రహదారి 37 దగ్గర స్థానిక గ్రామస్తులు వాహనాన్ని అడ్డుకున్నారు.
ఆవులు ఎక్కడివని ఆలీని ప్రశ్నించారు. తాను ఆవులను కొనుగోలు చేసి తీసుకు వెళుతున్నానని ఆలీ చెప్పాడు. అయితే రసీదు చూపించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆలీ రసీదు చూపించకపోవడంతో గ్రామస్తులు సహనం కొల్పోయారు.
ఆలీని కిందకు దించి ఇష్టం వచ్చినట్లు చికతబాదారు. ఆవులను కిందకు దించి వాహనానికి నిప్పంటించారు. తీవ్రగాయాలు కావడంతో ఆలీ అక్కడికక్కడే మరణించాడు. ఆలీకి సహకరించిన మిగిలిన పశువుల దొంగలను అరెస్టు చెయ్యాలని జాతీయ రహదారిలో ధర్నా నిర్వహించారు.
ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులతో చర్చించారు. ఆలీని హత్య చేసిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.