బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్ లో బాంబు అంటూ ఫోన్
బెంగళూరు: బెంగళూరు నగరంలో మరో సారి బాంబు పెట్టారని పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు హడలిపోయారు. జయనగరలో నిర్మాణంలో ఉన్న మెట్రో రైల్వేస్టేషన్ దగ్గర బాంబు లాంటి వస్తువు కనపడటంతో స్థానికులు హడలిపోయారు.
పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసిన వ్యక్తి జయనగరలోని లాల్ బాగ్ వెస్ట్ గేట్ సమీపంలోని మెట్రో రైల్వేస్టేషన్ దగ్గర ఎవరో బాంబు పెట్టారని సమాచారం ఇచ్చారు. పోలీసులు, బాంబు నిర్వీర్యదళం సిబ్బంది సంఘటనా స్థలానికి పరుగు తీశారు.
పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. అటు వైపు ప్రజలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే బాంబు లాంటి వస్తువు కనపడటంతో పోలీసులు దానిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పేపర్లలో మూటకటిన వస్తువులు పరిశీలించారు.
అందులో టపాకాయలకు ఉపయోగించే నల్లమందు ఉన్న విషయం గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరో కావాలనే ప్రజలను ఆందోళనకు గురి చెయ్యడానికి ఇలా చేశారని పోలీసు అధికారులు తెలిపారు. ఫోన్ ఎవరు చేశారు ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో బెంగళూరు నగరంలో అనేక సార్లు బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే.