వినోదం: జబర్దస్త్ వేణు మీద దాడిపై తెలంగాణ మంత్రి తలసాని
హైదరాబాద్: జబర్దస్త్ వేణు పైన దాడి జరగడం విచారకరమని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం అన్నారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేణును పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
వేణు పైన దాడి ఘటనలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. సినిమాలు, సీరియళ్లు మనకు వినోదం పంచేవన్నారు. వాటిని వ్యక్తిగతంగా ఆపాదించుకోవద్దని హితవు పలికారు.
కాగా, వేణు పైన దాడిని పలువురు ఖండించిన విషయం తెలిసిందే. కమెడియన్ వేణుపై దాడిని మా అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. జబర్దస్త్ టీంతో పాటు, టవీ, సినీ ఆర్టిస్టులు సోమవారం ఉదయం ఫిలించాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. దాడి ఘటనపై ఫిలించాంబర్ సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు.
సినిమాల్లో కమెడియన్ నటించే జబర్దస్త్ వేణుపై ఆదివారం ఫిల్మ్ నగర్ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన వేణుని స్నేహితులు చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కార్యక్రమంలో గౌడ సంఘాన్ని కించపరిచే విధంగా స్కిట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుండగులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.
కాగా శ్రామిక గౌడ మహిళా జీవన విధానాన్ని అవమానపర్చిన 'జబర్దస్త్' కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం జిల్లా నాయకులు రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 18వ తేదీ రాత్రి 9.30కి ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లుగీత వృత్తిని, గౌడ మహిళలను కించపరిచేలా ద్వందార్థలతో ప్రసారం చేశారని ఆరోపించారు.
అవమానకరంగా చిత్రీకరించిన జబర్దస్త్ టీంను, కార్యక్రమం జడ్జీలను, ఈ-టీవీ యాజమాన్యంపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ షోకు ప్రముఖ సినీ నటుడు నాగబాబుతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు, సినీ నటి రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.
జబర్దస్త్ వినోద కార్యక్రమం విశేషమైన ప్రజాదరణ పొందింది. హాస్యం, వ్యంగ్యం ప్రధానాంశాలుగా ఈ వినోద కార్యక్రమాలను రూపొందించి ప్రదర్శిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులను ఈ కార్యక్రమం విశేషంగానే ఆకర్షిస్తోంది. ఖతర్నాక్ కామెడీ షో అంటూ జబర్దస్త్కు ట్యాగ్ లైన్ కూడా ఇస్తున్నారు.