జయలలిత కేసు: 30 లక్షల ఓట్ల కోసం, అందుకే సిద్దు ప్లాన్
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అక్రమాస్తుల కేసు విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఆచితూచి ముందుకు వెళుతున్నది. రానున్న ఎన్నికలలో తమిళ ఓటర్లను ప్రసన్నం చేసుకునే విషయంలో జాగ్రతగా వ్యవహరిస్తున్నారు.
జయలలిత అక్రమాస్తుల కేసును కర్ణాటక హైకోర్టు ఏకసభ్య బెంచ్ కొట్టివేసింది. జయలలితతో పాటు ఆ కేసులో ఉన్న అందరికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తు సుప్రీంలో అప్పీలు చెయ్యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
సిద్దరామయ్య తన మంత్రి వర్గంతో రెండు సార్లు ఇదే విషయంపై చర్చించారు. న్యాయనిపుణలుతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని సిద్దరామయ్య మీడియాకు చెప్పారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలు జులై చివరి వారంలో జరగనున్నాయి.
బెంగళూరు నగరంలో సుమారు 30 లక్షల మంది తమిళ ఓటర్లు ఉన్నారు. 198 వార్డులు ఉన్న బెంగళూరులో అనేక వార్డులలో తమిళ ఓటర్ల ప్రభావం ఉంది. డీఎంకే, ఏడీఎంకే పార్టీ తరుపునా పోటి చేస్తుంటారు. ఆ తమిళ ఓటర్లును దూరం చేసుకోకూడదని సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది.
బీబీఎంపీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఆగస్టు 11వ తేది లోపు సుప్రీం కోర్టులో జయలలిత కేసు అప్పీలు చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తున్నది. అంతకు ముందే సుప్రీం కోర్టులో అప్పీలు చేస్తే బెంగళూరు లో ఉన్న జయలలిత అభిమానులు ఒక్క ఓటు కాంగ్రెస్ కు వెయ్యరని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.