జయలలిత విదేశాలకు వెళ్లలేదు, ఎందుకంటే ?
చెన్నై: అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని, ఎవ్వరూ ఆందోళన చెందనవసరం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమె కోలుకున్నారని, త్వరలో ఇంటికి వెలుతారని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.
తీవ్ర జ్వరం, డీ హైడ్రేషన్ తో అస్వస్థతకు గురైన జయలలిత గురువారం అర్దరాత్రి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమెకు నలుగురు వైద్యులు చికిత్స చేస్తున్నారు. సోమవారం ఉదయం జయలలితకు ఆసుపత్రిలో వైద్య పరిక్షలు చేశారు.
జయలలితను పరామర్శించి వచ్చిన వాళ్లంతా అమ్మ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని చెబుతున్నారు. అయితే చెన్నైలోని అపోలో ఆసుపత్రి దగ్గర అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు క్యూకడుతున్నారు.
అమ్మను చూడటానికి వేల సంఖ్యలో అభిమానులు
జయలితను చూడటానికి వేలాధి మంది కార్యకర్తలు రావడంతో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు అటు వైపు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వాహనాలకు అనుమతిలేదు
వేల సంఖ్యలో వస్తున్న వాహనాలను గ్రీమ్స్ రోడ్డులోనే నిలిపివేస్తున్నారు. ప్రముఖులు, ఆంబులెన్స్ లను మాత్రం అసుపత్రి వైపు అనుమతి ఇస్తున్నారు. మిగిలిన వాహనాలలో వస్తున్న రోగులు, వారి కుటుంబ సభ్యులను బ్యాటరీ కారులో ఆసుపత్రి దగ్గరకు తీసుకు వెలుతున్నారు.
ప్రత్యేక ప్రార్థనలు
జయలలిత త్వరగా కోలుకుని ఇంటికి చేరుకోవాలని ఆమె అభిమానులు, కార్యకర్తలు ఆసుపత్రి దగ్గర మోకాలి మీద నిలబడి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ అభిమానులు ఆలయాల్లో అర్చనలు, హోమాలు చేస్తున్నారు.
రథం లాగుతున్నారు
జయలలిత త్వరగా కోలుకుని ఇంటికి చేరుకోవాలని ఆకాక్షిస్తూ తమిళనాడులో ప్రసిద్ది చెందిన ఆలయాల్లో రథం లాగుతున్నారు. పేదలకు అన్నదానం చేస్తున్నారు. చర్చిలో కొవ్వొత్తులు వెలిగించి ప్రభువును వేడుకుంటున్నారు. మేరిమాత ఆలయాల్లో అన్నాడీఎంకే కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు.
అమ్మను కలిసిన మంత్రులు
తమిళనాడు సీఎం జయలలితను ఆ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి ఓ. పన్నీరు సెల్వం, రెవెన్యూ శాఖ మంత్రి ఉదయ్ కుమార్, ఆరోగ్య శాఖా మంత్రి విజయ్ భాస్కర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావ్, ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధా కృష్ణన్ పరామర్శించారు.
అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు
అన్నాడీఎంకే మహిళా విభాగం నాయకురాలు, సినీనటి సీ.ఆర్. సరస్వతి మీడియాతో మాట్లాడుతూ అమ్మ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
మంత్రికి అధికారం
తమిళనాడు ఆర్ధిక శాఖా మంత్రి ఓ. పన్నీరుసెల్వంకు ప్రభుత్వ అధికార భాద్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు తెలిపాయి. అమ్మ ఆరోగ్యం కుదటపడేవరకు ప్రభుత్వ కార్యకలాపాలు చూసుకోవాలని అమ్మ ఆదేశించారని తెలిసింది.
విదేశాలకు వెళ్లలేదు
తమిళనాడు సీఎం జయలలిత చికిత్స కోసం విదేశాలకు వెళ్లడం లేదని, ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని అపోలో ఆసుపత్రి వైద్యులు చెప్పారు. విశ్రాంతి కోసం జయలలిత ఆసుపత్రిలో ఉన్నారని వైద్యులు వివరించారు. సోమవారం జయలలిత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
రాహుకేతు పూజలు
జయలలిత అపోలో ఆసుపత్రిలో రాహుకేతు పూజలు చేశారని తెలిసింది. పండితులు ఆమెకు దోషం పోవాలని ప్రత్యేక పూజలు చేయించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
నమ్మరాదు
సోషల్ మీడియాలో వదంతులు నమ్మరాదని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అపోలో ఆసుపత్రి చీఫ్ సుబ్బయ్య విశ్వనాథన్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ వెంకట్, డాక్టర్ రమేష్, డాక్టర్ బామా మీడియాతో మాట్లాడుతూ జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని, సీఎం ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పారు.