సీఎం జయలలితకు చివాట్లు పెట్టిన ఈసీ
న్యూఢిల్లీ/చెన్నై: తమిళనాడు ఎన్నికల సందర్బంగా నియమావళికి విరుద్దంగా వ్యవహరించిన అధికార అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే)కి ఎన్నికల సంఘం (ఈసీ) చివాట్లు పెట్టింది. ప్రధాన ప్రతిపక్షమై డీఎంకే మీద ఈసీ మండిపడింది.
హేతుబద్ధమైన, ఆర్థికంగా సాధ్యం కాని అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మభ్యపెట్టారని అన్నాడీఎంకే మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రికి ఇటీవల రాసిన లేఖలో ఈసీ ఈ విధంగా పేర్కొంది.
ఎన్నికల సందర్బంగా మేనిఫెస్టో రూపకల్పనలో నిబంధనలు విస్మరించారని, ఈ విషయంపై వివరణ ఇవ్వాలని గత మే నెలలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు ఈసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు నిబంధనలు అతిక్రమించాయని మండిపడింది. తమిళనాడు ఎన్నికల సందర్బంగా ఉచితంగా కలర్ టీవీలు, వాషింగ్ మెషిన్లు, స్టీమ్ బాయిలర్లు, ఇడ్లీ కుక్కర్లు, గిఫ్ట్ కూపన్లు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
ఆర్థికంగా సాధ్యం కాని ఇలాంటి హామీలు ఏలా ఇస్తారని ఈసీ ప్రశ్నించింది. ఎన్నికల సందర్బంగా ప్రజలను మభ్య పెట్టటానికి ఇలాంటి హామీలు ఇచ్చారని చెప్పింది. ఇక ముందు మీరు జాగ్రత్తగా ఉండాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని డీఎంకేనీ ఈసీ హెచ్చరించింది.