జయ ఆరోగ్యంగా ఉన్నారు: హద్దుదాటితే మీ కథ చూస్తాం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆమె ఆరోగ్యంపై వచ్చే వదంతులు నమ్మరాదని అపోలో వైద్యులు, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
జయలలిత ఆరోగ్యం విషమించిందని పుకార్లు వ్యాపించాయి. ఈ సందర్బంలో రాష్ట్ర ప్రభుత్వం, అపోలో యాజమాన్యం స్పందించాయి. జయలలిత కోలుకున్నారని, ఆమె సాధారణ ఆహారం తీసుకుంటున్నారని అపోలో వైద్యులు తెలిపారు.
విశ్రాంతి కోసం జయలలిత ఆసుపత్రిలోనే ఉన్నారని అపోలో వైద్యులు స్పష్టం చేశారు. జయలలితకు తోడుగా ఆమె ప్రాణస్నేహితురాలు నెచ్చలి శశికళ, బంధువు ఇలవరసి ఆసుపత్రిలోనే ఉన్నారు.
తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి పన్నీరుసెల్వం మంగళవారం ఆసుపత్రి చేరుకుని అమ్మను పరామర్శించారు. జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని అపోలో ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చెయ్యడంతో ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.
సీఎం జయలలిత ఆరోగ్యంపై వదంతులు సృష్టించే వారి మీద, పుకార్లు చేసేవారి మీద, ఈ విషయంపై కథనాలు ప్రసారం చేసే మీడియాపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు పోలీసు శాఖ హెచ్చరించింది. పలువురు మంత్రులతో పాటు ప్రభుత్వ శాఖ ప్రధాన కార్యదర్శి, చెన్నై నగర పోలీసు కమిషనర్ తదితరులు జయలలితను పరామర్శించారు.
ఎన్నికల ప్రచారానికి అమ్మ దూరం
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దూరంగా ఉంటారని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు. అమ్మ ప్రచారం చెయ్యవలసిన అవసరం లేదని వారు చెబుతున్నారు.
ఎవ్వరిని గెలిపించుకోవాలో ప్రజలకు తెలుసని, అలాంటప్పుడు అమ్మ ప్రచారం చెయ్యనవసరం లేదని అంటున్నారు. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల జాబితా సిద్దం చేస్తున్నామని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి.
28న డీఎంకే అభ్యర్థుల జాబితా విడుదల
స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈనెల 28వ తేది విడుదల చెయ్యాలని డీఎంకే నిర్ణయించింది. మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లు కాకుండా డీఎంకే పోటీ చేసే స్థానాలలో ఎవరిని బరిలో దించాలి అని ఆ పార్టీ కోశాధికారి స్టాలిన్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారని డీఎంకే వర్గాలు తెలిపాయి.