కావేరీ జలాలకు ఓ లెక్కుంది: తమిళనాడుకు కొంచెం తిక్కుంది
బెంగళూరు: కావేరి జలాల పంపిణి గొడవ ఇప్పటిదికాదు. స్వాతంత్రం రాకముందు నుంచి కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చేస్తున్నారు. 1892, 1924లో రెండు సార్లు కావేరీ నీరు తమిళనాడు ప్రాంతాలకు విడుదల చెయ్యాలని అగ్రిమెంట్ చేసుకున్నారు.
1974 కావేరీ జలాల పంపిణి విషయంలో చేసుకున్న అగ్రిమెంట్ గడవు పూర్తి అయ్యింది. కర్ణాటక డ్యాంలు నిర్మించి కావేరీ జలాలు నిల్వ చేసి వ్యవసాయం చెయ్యడం మొదలుపెట్టింది. 1970నుంచి 1980లో కావేరీ జలాల విషయంపై నిజనిర్దారణ కమిటి ఏర్పాటు అయ్యింది.
కావేరీ జలాలతో తమిళనాడు 14,40,000 ఎకరాల నుంచి 25,80,000 ఎకరాల వరకు వ్యవసాయం చేస్తున్నదని కమిటి గుర్తించింది. కర్ణాటక 6,80,000 లక్షల ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నదని గుర్తించింది. విషయం తెలుసుకున్న తమిళనాడు మాకు ఇంకా ఎక్కువ నీరు విడుదల చెయ్యాలని డిమాండ్ చేసింది.
1990లో రెండు రాష్ట్రాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అప్పుడు కావేరి వాటర్ డిస్పూట్ ట్రిబునల్ (సీడబ్లుడీటీ) ఏర్పాటు అయ్యింది. 1991లో తమిళనాడుకు ప్రతి సంవత్సరం 205 టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చెయ్యరాదని డిమాండ్ చేస్తూ అప్పుడు జరిగిన ఆందోళనలు, అల్లర్లలో అనేక మంది ప్రాణాలు పోయాయి. 1995లో తమిళనాడు కావేరి జలాల కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
మీరు కావేరి జలాల పంపిణి బోర్డను ఆశ్రయించాలని, అప్పటి ప్రధాని పీ.వీ. నరసింహారావును సంప్రదించాలని సుప్రీంకోర్టు తమిళనాడుకు సూచించింది. అప్పటి ప్రధాని పీ.వీ. నరసింహారావు తమిళనాడుకు ఆరు టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని ఆదేశించారు.
1998లో కావేరి నదీ జలాల అథారిటి సీడబ్ల్యుడీటీ ఇచ్చిన ఆదేశాలు పాటించాలని కర్ణాటకకు సూచించింది. 2002లో తమిళనాడుకు 0.8 టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని కర్ణాటకకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే కర్ణాటక తమిళనాడుకు నీరు వదిలిపెట్టలేదు. చివరికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడంతో అప్పటి ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చేశారు.
2005లో కావేరీ జలాల పంపిణి విషయంపై ఇరు రాష్ట్రాల రైతులతో ఆరు సార్లు చర్చలు జరిపి ఓ పరిష్కారం కనుక్కోవడానికి ప్రయత్నించారు. 2007లో సీడబ్ల్యుడీటీ అంతిమ ఆదేశాలు జారీ చేసింది.
కావేరీ జలాలు మొత్తం 740 టీఎంసీలు ఉన్నాయని గుర్తించింది. అందులో తమిళనాడుకు 419 టీఎంసీలు, కర్ణాటకకు 270 టీఎంసీలు, కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని ఆదేశించింది.
2012లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తమిళనాడుకు 9 వేల క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని కర్ణాటకను ఆదేశించారు. అయితే అప్పుడు కర్ణాటక తమిళనాడుకు నీరు వదిలిపెట్టలేదు.
తమిళనాడు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రధాని ఆదేశాలను ఎలా దిక్కరిస్తారని సుప్రీం కోర్టు కర్ణాటక చెవ్వుపిండింది. 2013లొ సైతం కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు కావేరీ జలాల కోసం సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేశారు.
2016లో తమిళనాడుకు రోజుకు 15 వేల క్యూసెక్కుల నీరు 10 రోజులపాటు విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడుకు నీళ్లు విడుదల చెయ్యడంతో మొదలైన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
తరువాత సుప్రీం కోర్టు రోజుకు 12 వేల క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని ఆదేశించింది. అప్పటికి ఆందోళనాకారులు శాంతించలేదు. రోజుకు మూడువేల క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని కావేరి సూపర్ వైజరీ కమిటి ఆదేశించింది.
అయితే రెండు రాష్ట్రాలు అందుకు అంగీకరించకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. సుప్రీం కోర్టు రోజుకు ఆరు వేల క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తమిళనాడుకు కావేరి నీరు విడుదల చెయ్యరాదని చర్చించడానికి ప్రత్యేక శాసనసభ సమావేశం నిర్వహించారు.
ఆ సమావేశంలో కావేరీ నీరు కేవలం తాగునీటి అవసరాలకు ఉపయోగించాలని శాసన సభ్యులు (అఖిలపక్షం) ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.