పళనిసామిని గద్దె దించడానికి పన్నీర్ సెల్వం పక్కా ప్లాన్ ఇదే !
ఎడప్పాడి పళనిసామికి మద్దతు ఇచ్చిన 122 మంది ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో భారీగా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలని,
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సిద్దం అయ్యారు. శశికళ వర్గంపై పోరుకు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు పన్నీర్ సెల్వం రంగం సిద్దం చేశారు.
సీఎం,శశికళ వర్గం ఎమ్మెల్యేలకు టైట్ సెక్యూరిటీ: రావద్దండి అంటూ !
అసెంబ్లీలో బలపరిక్ష సందర్బంగా అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మధ్య చీలిక ఏర్పడి ఓటింగ్ లో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం కుప్పకూలుతుందని ఆశపడ్డ జయలలిత శిష్యుడు పన్నీర్ సెల్వంకు చివరికి నిరాశే మిగిలింది.
కుగ్రామాల్లో పర్యటనలు
శశికళ వర్గం మీద పోరుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రంగం సిద్దం చేశారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కుగ్రామాల్లో పర్యటించేందుకు సమాయాత్తం అవుతున్నారు. ఎలాగైన ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని గద్దె దించి అమ్మ పాలనను మళ్లీ తీసుకురావాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారు.
అమ్మ సమాధి సాక్షిగా
జయలలిత సమాధి సాక్షిగా ఆమె సన్నిహితురాలు శశికళ నాయకత్వంలోని అన్నాడీఎంకే అధిష్టానం మీద పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేశారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో విఫలం అయ్యారు. కేవం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయనకు మద్దతు ఇచ్చారు.
పన్నీర్ సెల్వం అభిమానుల సంఘం
అన్నాడీఎంకే పార్టీ గెలిచిన 136 అసెంబ్లీ నియోజక వర్గాల్లో తొట్టతొలుత పర్యటించాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారు. తన నివాసంలో పార్టీ సీనియర్ నాయకులు మధుసూదనన్, కేపి. మునిసామి, పొన్నయ్యన్, సత్తం విశ్వనాథన్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చలు మొదలు పెట్టారు. కార్యకర్తలను కూడగట్టుకునేందుకు పన్నీర్ సెల్వం అభిమానుల సంఘం (పేరవై) ఏర్పాటు చేసుకోవాలని పార్టీ సీనియర్లు ఆయనకు సూచించారు.
శశికళను టార్గెట్ చేసుకుని
అన్నాడీఎంకే పార్టీని శశికళ ఎలా స్వాధీనం చేసుకున్నారు, అధికారం కోసం జరిపిన అక్రమాల గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని, అదే లక్షంగా పర్యటన కొనసాగించాలని పన్నీర్ సెల్వం, ఆయన మద్దతు దారులు నిర్ణయించారు.
ఆర్ కే నగర్ నుంచి పర్యటన ప్రారంభం !
పన్నీర్ సెల్వం తన పర్యటనను జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ నియోజక వర్గం నుంచి పర్యటన ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ఈ విషయాన్ని మంగళవారం సాయంత్రం పన్నీర్ సెల్వం అధికారికంగా ప్రకటిస్తారని ఆయన అనుచరులు మీడియాకు చెప్పారు.
అమ్మకు ద్రోహం చేసిన 122 మంది ఎమ్మెల్యేలు
అమ్మ ఫోటో పెట్టుకుని ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు శశికళ బినామి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన 122 మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని పన్నీర్ సెల్వం రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్దం అయ్యారు. 122 శాసన సభ నియోజక వర్గాల్లో భారీగా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలని, స్థానిక ప్రజలు ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకువచ్చి ప్రభుత్వానికి మద్దు ఉపసంహరించే విధంగా ప్రయత్నించాలని నిర్ణయించారు.
ప్రభుత్వం, పోలీసులు అనుమతి ఇస్తారా ?
పన్నీర్ సెల్వం పర్యటనకు అదికారంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం, పోలీసు అధికారులు అనుమతి ఇస్తారా ? అనే విషయంపై అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా తమ పర్యటన కచ్చితంగా ఉంటుందని పన్నీర్ సెల్వం వర్గీయులు అంటున్నారు.
అమ్మకు ఇష్టం అయిన పచ్చరంగుతో వాహనం
జయలలితకు ఎంతో ఇష్టం అయిన ఆకుపచ్చ రంగుతో పన్నీర్ సెల్వం పర్యటనకు ఓ వాహనం సిద్దం చేశారు. పన్నీర్ సెల్వం ఇంటి ముందు నిలిపి ఉన్న ఈ వాహనం మీద అన్నా, ఎంజీఆర్, జయలలిత, పన్నీర్ సెల్వం ఫోటోలతో ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ వాహనంలోనే పన్నీర్ సెల్వం రాష్ట్ర వాప్తంగా పర్యటిస్తారని ఆయన వర్గీయులు అంటున్నారు.