ఢిల్లీ ఆర్డర్: చెన్నైకి గవర్నర్ విద్యాసాగర్ రావ్, ఢిల్లీలోనే పళని, పన్నీర్, ఏదో జరుగుతోంది!
చెన్నై: తమినాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తమిళనాడు గవర్నర్ (ఇన్ చార్జ్) సీహెచ్. విద్యాసాగర్ రావ్ శనివారం చెన్నైలో అడుగుపెడుతున్నారు. ఆకస్మికంగా ముంబై నుంచి తమిళనాడు రాజ్ భవన్ కు సమాచారం అందడంతో అన్నాడీఎంకేలో కొందరికి కలవరం మొదలైయ్యింది.
గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తరువాత పలువురు బీజేపీ పెద్దలను ఎడప్పాడి పళనిసామి కలిశారు. అదే రోజు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు.
అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాల నాయకులు ఢిల్లీలో ఉన్న సమయంలో గవర్నర్ విద్యాసాగర్ రావ్ తమిళనాడు పర్యటనకు సిద్దం కావడంతో ఏదో జరుగుతోంది ? అని అన్నాడీఎంకే పార్టీ నాయుకులు అంటున్నారు. శనివారం చెన్నై చేరుకుంటున్న గవర్నర్ విద్యాసాగర్ రావ్ ను ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్, పళనిసామి మీద తిరుగుబాటు చేస్తున్న టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు కలిసేందుకు సిద్దం అవుతున్నారు.