సీఎం,శశికళ వర్గం ఎమ్మెల్యేలకు టైట్ సెక్యూరిటీ: రావద్దండి అంటూ !
చెన్నై: తమిళనాడులో బయటకు వెళ్లడానికి మంత్రులు, అన్నాడీఎంకే పార్టీలోని శశికళ వర్గం ఎమ్మెల్యేలు భయంతో హడలిపోతున్నారు. ఎక్కడ ప్రజలు తిరగబడి దాడులు చేస్తారో అంటూ ఆందోళన చెందడంతో ప్రభుత్వం వారికి పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
రెండు వారాలు రిసార్ట్ లో ఎంజాయ్ చేసిన మంత్రులు, శశికళ వర్గంలోని 122 మంది ఎమ్మెల్యేలు సోమవారం తమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లడానికి సిద్దం అయ్యారు. అయితే స్థానికులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ఇంటికి వెలితే ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎడప్పాడి పళనిసామికి మద్దతు ఇస్తారా ?
అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి నాయకత్వంలోని ప్రభుత్వం విశ్వాసపరీక్షలో గెలవడంతో ఆయనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో ఆందోళనలు మొదలైనాయి. అమ్మ నమ్మిన వ్యక్తిని కాదని శశికళ వర్గానికి ఏలా మద్దతు ఇస్తారు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
చెన్నైలోని క్వాటర్స్ లో
ఎడప్పాడి పళనిసామికి మద్దతుగా ఓటు వేసిన 122 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం చెన్నైలోని క్వాటర్స్ లో కాలం గడుపుతున్నారు. తమిళనాడులోని పలు నియోజక వర్గాల్లో శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలు కనిపించడంలేదని, ఎవరైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని ఇప్పటికే పోస్టర్లు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పన్నీర్ సెల్వంతో రాజీనామా చేయిస్తారా
అమ్మ జయలలిత ఎంతగానో నమ్మిన అన్నాడీఎంకే పార్టీకి విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వంతో బలవంతంగా రాజీనామా చేయించి సీఎం కావాలని ప్రయత్నించి ప్రస్తుతం జైల్లో ఉన్న శశికళ అనుచరులకు మద్దతు ఇస్తారా అని తమిళనాడులో అన్నాడీఎంకే కార్యకర్తలు 122 మంది ఎమ్మెల్యేల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శశికళకు అండగా నిలిచిన మంత్రులు
చిన్నమ్మ చిన్నమ్మ అంటూ ఇన్ని రోజులు జపం చేసిన ఆమె వర్గంలోని మంత్రులు ఆర్ బీ. ఉదయ్ కుమార్. సెల్లూర్ రాజు ఇళ్ల వద్ద భారీగా పోలీసు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎడప్పాడి పళనిసామికి మద్దతు ఇచ్చిన 122 మంది ఎమ్మెల్యేల సొంత నియోజక వర్గంలోని ఇళ్లు, కార్యాలయాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
అడుగు పెట్టనివ్వం అంటూ బ్యానర్లు, ఫ్లెక్సీలు
మా నియోజక వర్గం ఎమ్మెల్యేలు కనపడటం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసిన అన్నాడీఎంకే కార్యకర్తలు మా నియోజక వర్గంలో ఎమ్మెల్యేలను అడుగు పెట్టనివ్వం అంటూ పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు.
సీఎం పళనిసామి, స్పీకర్ కు తగిలిన సెగ
తమిళనాడు సీఎం పళనిసామి స్వస్థలం అయిన సేలం జిల్లాలోని సిలువంపాళయంలోని ఇంటి వద్ద, సేలంలోని సూరమంగళం హైవే రోడ్డులోని ఇంటి దగ్గర 10 మంది సాయుధపోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.
స్పీకర్ ఇల్లు, కార్యాలయం దగ్గర
ప్రతిపక్షాలు చేసిన విన్నపం పక్కనపెట్టి బలపరిక్ష నిర్వహించిన స్పీకర్ ధనపాల్ ఇంటి దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సేలంలోని తాతకాపట్టి రైతు బజారు సమీపంలోని స్పీకర్ ధనపాల్ ఇంటి దగ్గర 10 మందికి పైగా సాముధ పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.