అసాధారణ పరిస్థితి: జల్లికట్టుపై రజినీ షాకింగ్ కామెంట్స్
ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత తమిళనాడులో ఆసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత తమిళనాడులో ఆసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట హాట్టాపిక్గా మారాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్న విషయం తెలిసిందే.
ప్రస్తుత పరిస్థితుల్లో రజనీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారంటూ ఇటీవల ఆయన అభిమానులు పెద్దఎత్తున పోస్టర్లు ముద్రించి చర్చకు దారి తీశారు. మరోవైపు రజనీకాంత్ కోసం పలు రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.
ఇలాంటి తరుణంలో ప్రస్తుత తమిళనాడు పరిస్థితి గురించి రజనీకాంత్ వ్యాఖ్యలు మేధావులను సైతం ఆలోచనలో పడేశాయి. కాగా ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ జల్లికట్టుపై ఈ విధంగా స్పందించారు.
'పెద్దగా అందం, తెలివి లేకపోయినా తమిళ ప్రజలు నన్ను ఆదరించారు. జయలలిత మరణానంతరం తమిళనాడులో అసాధారణ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జల్లికట్టు తమిళుల సంస్కృతి. ఎవరైనా సంస్కృతి విషయంలో కలుగజేసుకోకూడదు. ఎలాంటి నిబంధనలైనా విధించండి. అయితే జల్లికట్టుపై నిషేధం వద్దు' అని రజినీ వ్యాఖ్యానించారు.
పెద్దవారు మనకంటూ సంప్రదాయాన్ని ఏర్పరచారని.. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. కాబట్టి జల్లికట్టు కచ్చితంగా జరగాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర పరిస్థితులను పేర్కొంటూ రజినీ చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ పార్టీల నేతలు, విశ్లేషకులు చర్చలకు దిగుతున్నారట. రాజకీయ ప్రవేశంపై రజినీ ఆసక్తి చూపిస్తున్నారా? అంటూ తమ విశ్లేషణలను కొనసాగిస్తున్నారట.