స్టాలిన్కు ఆ వీడియో ఫుటేజీ ఇవ్వండి: పళని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..
బలపరీక్షకు సంబంధించిన వీడియో ఫుటేజీ కాపీని ప్రతిపక్ష నేత, డీఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కు అందజేయాల్సిందిగా మద్రాసు హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
చెన్నై: తమిళనాడు సీఎం పళనిస్వామి బలనిరూపణపై ప్రతిపక్ష డీఎంకె నేత స్టాలిన్ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షం లేకుండా బలనిరూపణ నిర్వహించడం పట్ల అభ్యంతరం తెలుపుతూ దానికి సంబంధించిన వీడియో ఫుటేజీలను తమకు అందజేయాలని హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. తాజాగా తమిళనాడు ప్రభుత్వానికి దీనిపై ఆదేశాలు జారీ చేసింది. బలపరీక్షకు సంబంధించిన వీడియో ఫుటేజీ కాపీని ప్రతిపక్ష నేత, డీఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కు అందజేయాల్సిందిగా ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తిరిగి కేసును మార్చి 24న విచారణ చేస్తామని కోర్టు ప్రకటించింది.
కాగా, అన్నాడీఎంకె రాజకీయాల్లో చోటు చేసుకున్న ప్రతిష్టంభన కారణంగా సీఎం పళనిస్వామిని గవర్నర్ విద్యాసాగర్ రావు బలపరీక్షకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆరోజు సభలో సీక్రెట్ ఓటింగ్ కోసం డీఎంకె పట్టుబట్టడంతో పాటు తీవ్ర గందరగోళం సృష్టించింది. దీంతో మార్షల్స్ సహాయంతో వారిని బయటకు పంపించి స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు.
మార్షల్స్ తన చొక్కా చింపారంటూ స్టాలిన్ అసెంబ్లీ బయట హల్ చల్ చేయడం.. ఆ తర్వాత దీక్ష పేరుతో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బలపరీక్షకు సంబంధించిన వీడియో ఫుటేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో స్టాలిన్ కోర్టు మెట్లెక్కారు.