తమిళనాడులో మరో కొత్త పార్టీ: పొలిటికల్ తెర పైకి దర్శకుడు 'తంగర్ బచ్చన్'..
తమిళ ప్రజల శ్రేయస్సుకు ప్రస్తుతం కొత్త రాజకీయ పార్టీ అవసరముందని తాను భావిస్తున్నట్లు తంగర్ బచ్చన్ తెలిపారు.
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. జయలలిత మేనకోడలు దీప జయకుమార్ ఇటీవలే ఎంజీఆర్ అమ్మ దీప పేరవై పేరుతో కొత్త పార్టీని స్థాపించగా.. మరో కొత్త పార్టీకి రంగం సిద్దమవుతోంది. తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, ఛాయాగ్రాహకుడిగా, కథా రచయితగా మంచి పేరు ఉన్న తంగర్ బచ్చన్ తాను కొత్త పార్టీ స్థాపించిబోతున్నట్లు ప్రకటించారు.
తమిళ ప్రజల మేలు కోరి తాను కొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. తమిళ సినీ పరిశ్రమలో పలు సామాజిక చిత్రాలను నిర్మించిన దర్శకుడిగా తంగరబచ్చన్ కు మంచి పేరు ఉంది. అళగి, సొల్ల, మరంద కథై, ఒంబదు రూపాయ్ నోటు వంటి చిత్రాలను తంగర బచ్చన్ తెరకెక్కించారు. హీరో ప్రభుదేవాతోను కలవాడియా పొళుదుగళ్ అనే చిత్రాన్ని నిర్మించారు. అయితే నిర్మాణ కార్యక్రమాలు పూర్తయినా.. ఆ చిత్రం ఇంతవరకు విడుదల కాలేదు.
తమిళ ప్రజల శ్రేయస్సుకు ప్రస్తుతం కొత్త రాజకీయ పార్టీ అవసరముందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. గతంలో డైరెక్టర్ లారెన్స్ సైతం పొలిటికల్ పార్టీ పెడుతానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా, ఇప్పటికే కొంతకాలంగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి తమిళ ప్రజలను తీవ్ర అసంత్రుప్తిలోకి నెట్టింది. అన్నాడీఎంకెలో కుమ్ములాటలతో ఆ పార్టీ మద్దతుదారులంతా పన్నీర్-శశికళ వర్గంగా చీలిపోయారు. ఇంతలో ఆర్కేనగర్ ఉపఎన్నిక రావడంతో ప్రజలు ఎవరికి పట్టం కడుతారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు ఈ పరిస్థితులన్నింటిని తమకు అనుకూలంగా మలుచుకుని తమిళనాడులోను పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఆర్కేనగర్ బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో భేటీ అయి, తనకు రజినీ మద్దతు ఉన్నట్లుగా ప్రకటించుకున్నారు. ఏదేమైనా ఆర్కేనగర్ ఉపఎన్నిక తర్వాత తమిళ రాజకీయాలు మరో మలుపు తీసుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ప్రజలు పన్నీర్ వర్గానికి పట్టం కడితే.. శశికళ శిబిరం నుంచి ఎమ్మెల్యేలు జారిపోయే అవకాశం లేకపోలేదు.