12 రోజుల తర్వాత బయటకు జయ, స్వామిపై దావా
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత 12 రోజుల తర్వాత చెన్నైలోని పోయెస్ గార్డెన్స్ తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. పసుం పోన్ ముత్తు రామలింగం దేవర్ జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
రామలింగం దేవర్ చిత్రపటానికి నివాళులర్పించి.. తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయారు. అక్రమాస్తులు కేసులో 21 రోజులు పాటు జైలు శిక్ష అనుభవించిన జయలలిత ఈ నెల 18 మధ్యాహ్నం బెంగుళూరులోని పర్పపన అగ్రహార జైలు నుంచి బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.
ఆరోజు సాయంత్రం చెన్నైలోని తన నివాసానికి చేరుకున్న జయలలిత.. ఈరోజే బయటకు వచ్చారు.
సుబ్రమణ్య స్వామిపై పరువు నష్టం దావా నిలిపివేత
బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామిపై దాఖలైన పరువునష్టం దావా కేసును సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది. సుబ్రమణ్య స్వామిపై జయలలిత దాఖలు చేసిన ఈ పిటిషన్ను గురువారం విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
దీపక్ మిశ్రా, యూయూ లలిత్లతో కూడిన ధర్మాసనం తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా సుబ్రమణ్య స్వామి యత్నిస్తున్నాడంటూ జయలలిత పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుబ్రమణ్య స్వామి వాదనల విన్న కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
చెన్నై సెషన్ కోర్టులో ఉన్న ఐదు పరువు నష్టం పిటీషన్లను కూడా సుప్రీం కోర్టు పెండింగ్లో పెట్టింది. ప్రజాభిప్రాయం చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. నాపై వేసిన కేసు రాజ్యాంగ విరుద్ధమని స్వామి తన వాదనలో పేర్కొనడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.