ఆ ఎంపీ ఆంటీ కోర్టునే బురిడి కొట్టించింది
చెన్నై: అన్నాడీఎంకే ఎంపీ (రాజ్యసభ) శశికళ పుష్పను మధురై పోలీసులు అరెస్టు చెయ్యడానికి సిద్దం అయ్యారు. కోర్టునే బురిడి కోట్టించిన శశికళ పుష్ప ఆంటీని సోమవారం అరెస్టు చేస్తామని మధురై పోలీసులు అంటున్నారు.
అమ్మ జయలలిత ఆదేశాలను ధిక్కరించిన శశికళ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. అమ్మకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి శశికళ పుష్పతో సహ ఆమె కుటుంబ సభ్యులకు ముచ్చెమటలు పట్టించే విధంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
శశికళ పుష్ప కుటుంబంతో తాము మోసపోయామని పలువురు పోలీసులను ఆశ్రయించి కేసులు పెడుతున్నారు. అరెస్టు కాకుండా ఢిల్లీలో మకాం వేసిన శశికళ పుష్ప ఇప్పటికే రెండు సార్లు సుప్రీం కోర్టు ద్వారా అరెస్టు గండం నుంచి తప్పించుకున్నారు.
అయితే ఇప్పుడు అమెను అరెస్టు చెయ్యడానికి మధురై పోలీసులు సిద్దంగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆమె మధురై న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ లో డాక్యుమెంట్లు, సంతకాలు ఫోర్జరీ చేశారని వెలుగు చూసింది.
ఎంపీ శశికళ పుష్ప దాఖలు చేసిన పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం అవి నకిలీ అని గుర్తించి కేసు నమోదు చెయ్యాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం మధురై పోలీసులు శశికళ పుప్ప మీద కేసు నమోదు చేశారు.
సోమవారం శశికళ పుష్ప మధురై బయలుదేరి వెళ్లారు. మధురై వచ్చిన వెంటనే శశికళ పుప్పను అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు. తూత్తుకుడిలోని శశికళ పుష్ప ఇంట్లో పని చేస్తున్న ఝాన్సీరాణి, భానుమతి తమను లైంగికంగా వేధించారని శశికళ భర్త, ఆమె కుమారుడి మీద కేసు పెట్టారు.
ఆ కేసు శశికళ పుష్ప కుటుంబ సభ్యులకు చుట్టుకుంది. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆమె ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నించారు. నకిలీ డాక్యుమెంట్లు ఇవ్వడంతో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయారు.
కోర్టునే బురిడి కొట్టించే ప్రయత్నం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్జరి చేశారని, మోసగించే విధంగా వ్యవహరించారని పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం కోర్టుకు సంబంధించినది కాబట్టి శశికళ పుష్ప కచ్చితంగా అరెస్టు అయ్యే అవకాశం ఉంది.