కాలే కడుపులకు పట్టెడన్నం.. తారా పాట్కర్: 'రోటీ బ్యాంక్'తో దుర్భిక్షాన్ని తరిమేస్తున్న రియల్ హీరో
వ్యవస్థలు విఫలమైనచోట.. పట్టెడన్నం పెడుతానని పట్టించుకున్నవాడెవడు?.. స్వార్థం ఎగపోసే జీవితాలకు పక్కనవాడి ఆకలి పట్టిందెన్నడు?..
"ఆకలి ఊదే నాదస్వరానికి ఆడేవాడే మనిషి.." ఆకలి రాజ్యం సినిమాలో హీరో కమల్ హాసన్ చెప్పే డైలాగ్ ఇది. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం 1981లో విడుదలైందా సినిమా. కానీ అప్పటికీ.. ఇప్పటికీ.. పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత.. ఇంకా ఖాళీ కడుపుల్లో సుస్తుగా నిద్రపోతూనే ఉన్నాయి.
ఎండిన డొక్కల్లో ఏళ్ల నాటి దారిద్ర్యం సూదుల వలే సురుక్కుమని పొడుస్తుంటే.. పస్తులతోనే సగం బతుకులు తెల్లవారిపోతున్నాయి. టన్నుల కొద్ది ఎంగిలి కూడు చెత్తకుప్పల మీద దర్శనమిస్తుంటే.. కాలే కడుపులు ఆకలితో పాడెల మీదకు ఎక్కుతున్నాయి.
వ్యవస్థలు విఫలమైనచోట.. పట్టెడన్నం పెడుతానని పట్టించుకున్నవాడెవడు?.. స్వార్థం ఎగపోసే జీవితాలకు పక్కనవాడి ఆకలి పట్టిందెన్నడు?.. ఎవరెలా ఉన్నారో.. ఎవరు పట్టించుకున్నారో.. పట్టించుకోలేదో కానీ ఒక్కడు మాత్రం పట్టించుకున్నాడు. 'తారా పాట్కర్' అనే ఓ సామాన్య జర్నలిస్టు.. వృత్తిని సైతం త్యజించి కాలే కడుపులకు కంచం నిండా అన్నం పెడుతున్నాడు.
రోటీ బ్యాంక్:
ఆయన మదిలో మెదిలిన 'రోటీ బ్యాంక్' అనే ఆలోచన ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు చాలామందికి కడుపు నిండా తిండి పెడుతోంది. బుందేల్ ఖండ్ లోని మహోబా అనే జిల్లాలో పాట్కర్ తొలిసారిగా ఈ రోటీ బ్యాంకును స్థాపించాడు. ఇందుకోసం 2014 తన ఉద్యోగాన్ని సైతం వదిలి పూర్తిగా దీనికే అంకితమయ్యాడు.
రోటీ బ్యాంక్ ప్రారంభించిన తొలినాళ్లలో.. పాట్కరే స్వయంగా ఇంటింటికి తిరిగి రొట్టెలు సేకరించేవాడు. అక్కడి ప్రజలు కూడా ఆయనకు పూర్తిగా సహకరించారు. తమ ఇళ్లలో మిగిలిపోయిన రోటీలను, కూరలను ఆయనకు ఇచ్చేవారు. అలా సేకరించిన ఆహారాన్ని గ్రామంలో ఆకలితో ఉన్నవారికి పంపిణీ చేసేవాడు.
తర్వాతి కాలంలో ఆయన ఆలోచన నచ్చి.. క్రమక్రమంగా కొంతమంది వాలంటీర్లు ఆయనతో జతకలిశారు. వాలంటీర్లకు ఆయన ఇచ్చేది ఏమి ఉండదు.. అలాగే వారి నుంచి ఆశించేది ఏమి ఉండదు. ఆకలితో అలమటించేవారికి పట్టెడన్నం పెట్టడమే వారి ధ్యేయం. అలా ప్రతీరోజు 500ఇళ్ల నుంచి ఆహారాన్ని సేకరించే ఈ రోటీ బ్యాంక్ నిర్వాహకులు.. దాదాపు ప్రతీ రోజు 1000మంది ఆకలిని తీరుస్తున్నారు.
పాట్కర్ నమ్మిన సిద్దాంతం:
పాట్కర్ నమ్మిన సిద్దాంతం ఒక్కటే.. తాను బతికున్నంత వరకు మహోబా జిల్లాలో ఆకలితో అలమటించే మనిషే ఉండవద్దు. తొలుత ఒకే ఒక కేంద్రంగా ప్రారంభమైన రోటీ బ్యాంక్.. ఇప్పుడు పలు శాఖలుగా విస్తరించింది. ప్రతీరోజు ఆయా ఇళ్లల్లో ఆహారాన్ని సేకరించే వాలంటీర్లు.. వాటిని రోటీ బ్యాంక్ కేంద్రాల్లో అందిస్తారు. ఆకలితో ఉండే ప్రజలకు రోటీ బ్యాంక్ నిర్వాహకులు వాటిని అందిస్తారు.
తొలుత కేవలం 40ఇళ్ల వారు మాత్రమే రోటీ బ్యాంక్కు మిగిలిపోయిన ఆహారాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ తర్వాతి రోజుల్లో ఆ సంఖ్య 400కు చేరుకుంది. అలా తారా పాట్కర్ మదిలో మెదిలిన ఆలోచన ఇప్పుడు మహోబా జిల్లాలో ఆకలి దుర్భిక్షం అనేదే లేకుండా చేసింది.
ఎంతోమంది నిరాశ్రయులకు చేయూత:
తారా పాట్కర్ ఆలోచన నచ్చిన సెయింట్ జోసెఫ్ స్కూల్ యాజమాన్యం కూడా ఆయనకు చేయూతనిచ్చేందుకు సిద్దమైంది. ప్రతీరోజు పిల్లలకు పెట్టే లంచ్ బాక్స్ లో ఎంతో కొంత ఆహారాన్ని అదనంగా పెట్టి పంపించాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులను కోరింది. అలా ఆ పాఠశాల విద్యార్థులు తీసుకొచ్చే ఎక్స్ట్రా ఫుడ్ కూడా నేరుగా రోటీ బ్యాంక్ కేంద్రాలకే చేరుతుంది.
ఈ రోటీ బ్యాంక్ కేంద్రాల ద్వారా ఆకలి తీర్చుకుంటున్నవారిలో వృద్దులు, గ్రామీణ ప్రాంత ప్రజలు, యాచకులు, నిరాశ్రయులే ఎక్కువ. కాగా, ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ చాలా వెనుకబడిన ప్రాంతం. ఇప్పటికీ సరైన విద్య, వైద్య, విద్యుత్, సౌకర్యాలు లేనే లేవు. అలాంటి చోట తారా పాట్కర్ చేపట్టిన ప్రయోగం చాలామందిని పూటకింత ముద్ద తినేలా చేసింది.
100కేంద్రాలుగా విస్తరించి:
ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో దాదాపు 100రోటీ బ్యాంక్ కేంద్రాలుగా తారా పాట్కర్ ఆలోచన విస్తరించింది. ఇంత చేసిన.. చేస్తున్న తారా పాట్కర్.. ఎవరైనా ఆయన కృషిని మెచ్చి అవార్డులు ఇస్తానన్న నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. దానికి బదులు 'వీలైతే మీరూ ఓ రోటీ బ్యాంక్ ఏర్పాటు చేయండి.. అదే మీరు నాకిచ్చే అసలైన బహుమానం' అంటూ నిండు హృదయంతో చెబుతాడు. తారా పాట్కర్ లాంటి వ్యక్తులు రాష్ట్రానికి ఒక్కరున్నా.. దేశంలో ఆకలి దారిద్య్రాన్ని తరిమికొట్టవచ్చు. పేదల కోసం పుట్టిన ఇలాంటి మనిషికి 'సలాం' చెప్పకుండా ఎలా ఉండగలం..