టీ, సమోసాలకు అఖిలేష్ ప్రభుత్వం ఖర్చు రూ.9కోట్లు!
లక్నో: ఉత్తర ప్రదేశ్లో అధికారంలో ఉన్న అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం కేవలం టీ, సమోసాల కోసం దాదాపు రూ.9 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా అఖిలేష్ చెప్పారు. టీ, సమోసా, గులాబ్జామ్ల కోసం తమ ప్రభుత్వం రూ.9 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.
బుధవారం నాడు యూపీ శాసనసభలో ఆయన తమ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన ఖర్చుల గురించి వివరించి చెప్పారు. దానిలో ప్రభుత్వాధికారుల వద్దకు అతిథులు వచ్చినప్పుడు, అధికారులతో సమీక్షలు నిర్వహించినప్పుడు అయిన ఖర్చులన్నింటినీ వివరించారు.
ఈ సందర్భంగా అతిథులకి, అధికారులకి టీ, కాఫీ, సమోసా, గులాబ్జామ్, మిక్చర్ వంటి స్నాక్స్ ఇవ్వడానికి నాలుగేళ్లలో 8,78,12,474 రూపాయలు ఖర్చయిందని వెల్లడించారు. మార్చి 15, 2012 నుంచి మార్చి 15, 2016 వరకు వాటికి అయిన ఖర్చు రూ.9 కోట్లుగా ఉందన్నారు.
ఈ ఖర్చులను అత్యధికంగా ఎవరు చేశారో, అత్యల్పంగా ఎవరుచేశారో కూడా చెప్పారు. అత్యధికంగా మంత్రి అరుణ్ కుమార్ కోరి 22,93,800 ఖర్చు చేస్తే, మంత్రి సదాబ్ ఫాతిమా అత్యల్పంగా రూ.72వేలు స్నాక్స్ కోసం ఖర్చు చేశారు.
మరో మంత్రి అజాం ఖాన్ రూ.22 లక్షలు ఉపయోగించారు. అఖిలేష్ ఈ ప్రకటన చేయగానే ఆయన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ప్రజాధనాన్ని అఖిలేష్ ప్రభుత్వం దోచుకుందని బిజెపి మండిపడింది. ప్రజాసంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేసి స్నాక్స్ కోసం రూ.9 కోట్ల వినియోగించడం ఏంటని దుయ్యబట్టింది.