రూ. 500 కోసం విద్యార్థినులను బట్టలూడదీసి తనిఖీ
గుర్దాపూర్: తన దగ్గరున్న రూ. 500 నోటు పోయిందని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు.. పాఠశాలలోని 15 మంది బాలికలను వివస్త్రలను చేసి తనిఖీ చేసింది. ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని గుర్దాస్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. మడియాలా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ అయిన హర్జీత్ కౌర్ తన దగ్గరున్న రూ. 500 నోటు పోయిందనే నెపంతో ఏడో తరగతి బాలికలను బట్టలూడదీసి తనిఖీ చేసింది.
టీచర్ చర్యను అవమానంగా భావించిన బాధిత విద్యార్థినులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలిపారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాలికల తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు విద్యార్థులపై వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయురాలు హర్జీత్ కౌర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందిత ఉపాధ్యాయురాలు పరారీలో ఉందని పోలీసులు తెలిపారు.