దారుణం: మహిళా టెక్కీని వెంటాడి నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపారు
పుణె: మహారాష్ట్రలోని పుణె నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న ఓ యువతిని ఓ దుండగుడు వెంటాడి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఆమె పనిచేస్తున్న కార్యాలయానికి సుమారు 500 మీటర్ల దూరంలోనే ఈ దారుణం చోటుచేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కోల్కతాకు చెందిన అంతారాదాస్ (23) ఇక్కడ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. నగర శివారులోని తల్వాడేలో ఉన్న కార్యాలయంలో విధులు ముగించుకుని శుక్రవారం రాత్రిఒంటరిగా తిరిగి వస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో వెంబడించాడు.
తనను కాపాడాలంటూ ఆమె కొంతదూరం పరుగు తీసింది. యువతితో వాగ్వాదానికి దిగిన దుండగుడు కత్తితో మెడపైనా, చేతిపైనా తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న సిన్హా అనే వ్యక్తి ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు.
అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై స్థానిక దెహు పోలీసులకు సిన్హా ఫిర్యాదు చేశాడు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అక్కడ లభించిన బాధితురాలి ఐడీ కార్డు ఆధారంగా వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.