టెక్కీ హత్య కేసులో కజిన్ ప్రధాన అనుమానితుడు
నోయిడా: సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంకిత్ చౌహాన్ హత్య కేసులో అతని కజిన్ను పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన అంకిత్ చౌహాన్ హత్యకు గురైన విషయం తెలిసిందే. కజిన్ కొద్ది రోజుల క్రితం అంకిత్ చౌహన్ కుటుంబాన్ని బెదిరించడంతో అతన్ని పోలీసులు ప్రధాన అనుమానితుడిగా పరిగణిస్తున్నారు.
అయితే, అంకిత్ చౌహాన్ హత్యకు పాల్పడినట్లు చెప్పడానికి ఏ విధమైన ఆధారాలూ లేవని అంటున్నారు. అతను ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. విచారణ నిమిత్తం అతన్ని నోయిడాకు పిలిపించారు.
అతను కార్యాలయానికి సరిగా వెళ్లకపోయేవాడని, ప్రస్తుతం నోయిడాలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడని, అంతకు ముందు చాలా కాలం ఉద్యోగం చేయలేదని, అతను అనుమానితుడు మాత్రమేనని పోలీసులు అంటున్నారు.
మిమ్మల్ని నేను చంపలేకపోతే, ఎవరో ఒకరు చంపుతారని అతను అంకిత్ కుటుంబ సభ్యులను బెదిరించినట్లు చెబుతున్నారు. అయితే, ఏ సందర్భంలో ఆ బెదిరింపులకు పాల్పడ్డాడనేది తెలియడం లేదు. అంకిత్ చౌహన్ను హత్య చేసిన షూటర్ ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు.
అంకిత్ చౌహాన్ను చంపడానికి వచ్చిన దుండగుల ప్రయాణించిన తెల్లటి కారును ఆచూకీని పట్టుకోవడానికి పోలీసులు శుక్రవారంనాడు పలు తెల్ల హోండా అకార్డు కార్ల యజమానులను పోలీసులు సందర్శించారు .