ఫేస్బుక్ లైక్స్: సెల్ఫీ కోసం వెళితే.. ప్రాణాలు పోయాయి
రాయ్పూర్: ఫేస్బుక్ తన సెల్ఫీకి ఎక్కువ లైక్స్ రావాలని ఓ 13 ఏళ్ల బాలుడు చేసిన ప్రయత్నం అతని ప్రాణాలను బలితీసుకుంది. కేతన్ పొద్దార్ అనే బాలుడు గూడ్స్ రైలుపై ఫొటో దిగాలని భావించి.. దానిపైకి ఎక్కి చేతులు పైకి లేపి ఫొటో దిగుతుండగా.. పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే.. కేతన్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. అతడు బిలాస్పూర్ జిల్లా వైశాలినగర్ వాసి. కేతన్ తండ్రి సంజయ్ పొద్దార్ రైల్వేలో ఇంజన్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం మిత్రులతో కలిసి కేతన్ సెల్ఫీ దిగేందుకు బిస్లాపూర్ లోకోమోటివ్ సబ్ స్టేషన్ వద్దకు వెళ్లాడు.
అక్కడ గతంలో ఓ గూడ్సు రైలుపై నిలబడి తీసుకున్న ప్రొఫైల్ పిక్చర్కు ఫేస్బుక్లో ఎన్నో లైక్స్, కామెంట్స్ వచ్చాయి. దీంతో మరోసారి కూడా అక్కడే, అదే రైలుపై నిలబడి ఫొటో తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలోనే గూడ్సు రైలు ఎక్కాడు.
కొన్ని స్నాప్స్ క్లిప్ చేసిన తర్వాత, చేతులు పైకెత్తి ఫొటోకు ఫోజ్ ఇవ్వబోయాడు. అయితే పైన ఉన్న విద్యుత్ తీగలు అతని చేతులకు తగలడంతో విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన అతని మిత్రులు అక్కడి నుంచి పరారయ్యారు.
కాగా, కేతన్ ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు వెదుకులాట ప్రారంభించారు. అతని స్నేహితులను గట్టిగా అడిగితే.. కేతన్ విద్యుత్ షాక్కు గురై చనిపోయాడని చెప్పారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు విగత జీవిగా పడివున్న కేతన్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేతన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.