వైసీపీ మస్తాన్ వలీతో సినిమా కష్టాలు: ఎవరీ నీతు అగర్వాల్?
హైదరాబాద్: ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నీతు అగర్వాల్ రాజస్థాన్లోని మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతి. సినిమాల్లో వెలిగిపోతామని వచ్చి, మస్తాన్ వలీ చేతికి చిక్కడంతో.. సినిమాలాగే ఆమె జీవితం కూడా అనూహ్య మలుపులు తిరిగింది.
నీతూ అగర్వాల్ బీకాం వరకు చదివింది. టాలీవుడ్లోకి వచ్చాక తెలుగు మాట్లాడటం నేర్చుకుంది. 2013లో మస్తాన్కు పరిచయమైంది. అప్పటికే ఎర్ర చందనం స్మగ్లింగ్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన మస్తాన్ వలీ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాడు.
తాను నిర్మాతగా వ్యవహరించిన ప్రేమ ప్రయాణంలో అవకాశం ఇచ్చాడు. ఆమెకు రూ.34 లక్షలతో ఫ్లాట్ కొనిచ్చాడు. దాంతో మస్తాన్ మాయలో నీతు చిక్కుకుంది. తల్లిదండ్రులు మందలించినా, అతడితో సహజీవనం, ఆ తర్వాత పెళ్లి కొనసాగించింది.
తన స్మగ్లింగ్ కార్యకలాపాలకు నీతును ఉపయోగించుకున్నాడు. అయితే, పెళ్లి నాటి నుంచి తీవ్రంగా కొట్టేవాడని ఆమె వాపోయింది. తాను పోలీసులకు లొంగిపోతానంటూ ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన ఓ పెద్ద మనిషికి ఇటీవల ఆమె ఫోన్ చేసింది. అయితే, లొంగిపోవద్దని ఆ పెద్ద మనిషి హుకుం జారీ చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
నీతు సినిమా అవకాశాల కోసం నిత్యం చెన్నై, ముంబైలకు తిరిగేది. ఆమెకు హైదరాబాదులో కొందరు స్నేహితులు ఉన్నారు. అనంతరం మస్తాన్ వలీతో పరిచయం ఏర్పడి, చిక్కుల్లో పడింది. పోలీసుల విచారణలో.. మస్తాన్ వలీ ఎర్ర చందనం స్మగ్లింగ్ కోసం డబ్బులు వినియోగిస్తున్నట్లు తనకు తెలియదని చెప్పినట్లుగా సమాచారం.