పార్లమెంట్: ముఫ్తీ వ్యాఖ్యలతో చిక్కుల్లో బీజేపీ, ఏపీ చట్ట సవరణ బిల్లు
న్యూఢిల్లీ: రైల్వే, సాధారణ బడ్జెట్లలో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు సోమవారం నాడు రాజ్యసభలో నిరసన తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్... రెండు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ ఎంపీలు జేడీ శీలం, వి హనుమంత రావు, ఎంఏ ఖాన్, టీ సుబ్బిరామిరెడ్డిలు రాజ్యసభలో పోడియం వద్ద ఆందోళన తెలిపారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు, లోటు బడ్జెట్లో ఉన్న ఏపీకి న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
ముఫ్తీ సయీద్ వ్యాఖ్యలపై లోకసభలో రగడ
పాక్, వేర్పాటువాదుల వల్ల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్న ముఫ్తీ సయీద్ వ్యాఖ్యలపై లోకసభలో రగడ జరిగింది. పాకిస్తాన్ను ప్రశంసించడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ముఫ్తీ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పారు. తాను ప్రధాని ఆదేశాలతోనే ప్రకటన చేశానని చెప్పారు.
కాశ్మీర్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఆ వ్యాఖ్యలు మన ఆర్మీ, పోలీసులను కించపరిచేలా ఉన్నాయన్నారు. దీనికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ లోకసభ నుండి వాకౌట్ చేసింది. కాగా, కాశ్మీర్ సీఎం వ్యాఖ్యలు బీజేపీని ఇరుకున పడేశాయి.
ఎమ్మెల్సీ స్థానాలు పెంచుతూ సవరణ బిల్లు, వెనక్కి తీసుకోవాలని తెరాస
ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలను పెంచుతూ నిర్ణయం తీసుకునేందుకు చట్ట సవరణ బిల్లు పెట్టారు. ఈ బిల్లుతో ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలు 50 నుండి 58కి పెరుగుతాయి. అయితే, ఈ బిల్లుతో తెరాస విభేదించింది. బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణతో సంప్రదించాక నిర్ణయం తీసుకోవాలని తెరాస ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. అయితే, విభజన సమస్యల పరిష్కారంలో ఇదో ముందడుగు అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
సోనియాను వేర్వేరుగా కలిసిన పొన్నాల, భట్టి
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మల్లు భట్టి విక్రమార్కలు సోమవారం నాడు వేర్వేరుగా కలిశారు. మొదట పొన్నాల కలిశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులను ఆమెకు వివరించారు. అనంతరం మల్లు భట్టి విక్రమార్క కలిశారు. కాగా, టీపీసీసీ పదవుల పైన ఇవాళ అధికారికంగా వెలువడే అవకాశాలున్నాయి.
మోడీ, వెంకయ్యలపై పోలీసులకు ఫిర్యాదు
ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులపై విశాఖ త్రీటౌన్ పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు.