గోవాలో పట్టాలు తప్పిన ఎర్నాకుళం దురంతో ఎక్స్ప్రెస్
న్యూఢిల్లీ: ముంబై నుంచి ఎర్నాకుళం వెళ్తున్న దురంతో ఎర్నాకులం ఎక్స్ప్రెస్ గోవా పరిధిలోని బల్లీ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. మొత్తం 10 బోగీలు పట్టాలు తప్పినట్లు కొంకణ్ రైల్వే కార్పోరేషన్ లిమిటెడ్ అధికారిక ప్రతనిధి బాబన్ గాట్గే తెలిపారు.
పట్టాలు తప్పిన బోగీల్లోని ప్రయాణీకులను డీఎంయూ ద్వారా పట్టాలు తప్పని బోగీల్లోకి తరలించారు. ప్రయాణీకులను తరలించేందుకు బస్సులను కూడా ఉపయోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎర్నాకుళం దురంతో ఎక్సప్రెస్ పట్టాలు తప్పడంతో వేరే రైలులో ప్రయాణీకులను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఆదివారం ఉదయం ఉదయం 6.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు వివరించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ఈ ఘటనతో కొంకణ్ రైల్వే మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కొంకణ్ రైల్వే రైలు ప్రయాణీకులకు ఉపాహారం, టీ, కాఫీ, భోజనం, త్రాగునీటి ఏర్పాటు చేసింది. ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినల్ నుంచి ఎర్నాకుళం బయలు దేరి వెళుతుండగా ఈ ఘటన జరిగిందన్నారు. రైలు పట్టాలు తప్పందన్న విషయంపై అధికారులు విచారణ ప్రారంభించారు.