ఎన్కౌంటర్: ఇద్దరు భారత జవాన్ల మృతి, ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: సరిహద్దులో ఉగ్రవాదులు మరోసారి భారత ఆర్మీ స్థావరాలపై దాడులకు పాల్పడ్డారు. నగ్రోటాలోని ఆర్మీ క్యాంపుపై తెల్లవారుజామున 5.30 గంటలకు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ హైవేకు 20 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది.
ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు నగ్రోటాలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు భీకరంగా కొనసాగుతోన్నాయి. ఉగ్రవాదుల కోసం భారత బలగాలు కూంబింగ్ చేపట్టాయి.
ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో జమ్మూ - శ్రీనగర్ హైవేను మూసివేశారు. ముందస్తు జాగ్రత్తగా నగ్రోటాలోని పాఠశాలలను, ఇతర కార్యలయాలను మూసివేశారు. జమ్మూలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
ముగ్గురు ఉగ్రవాదుల హతం
కాగా, జమ్మూలోని సాంబా సెక్టార్ వద్ద ఉగ్రవాదులు చొరబడేందుకు యత్నించారు. మంగళవారం ఉదయం నుంచి భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఆపరేషన్ ముగిసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.