న్యూడ్ ఫోటోలు: ఎంబీఏ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: సీనియర్, అతని స్నేహితులు ఎంబీఏ విద్యార్థిని మీద అత్యాచారం చేసి ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లలో చిత్రీకరించారని, ఆ ఫోన్ లు మీరు ఎందుకు సీజ్ చెయ్యలేదని హర్యానా ప్రభుత్వానికి, అక్కడి పోలీసులకు సుప్రీం కోర్టు మొటిక్కాయలు వేసింది.
హర్యానాలోని జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీలో ఎంబీఏ రెండవ సంవత్సరం చదువుతున్న యువతి (21) మీద అదే యూనివర్శిటిలో చదువుతున్న ఆమె సీనియర్, అతడి స్నేహితులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమె న్యూడ్ ఫోటోలను మొబైల్ లో బంధించి బ్లాక్ మెయిల్ చేసి ఏడాదిన్నరగా ఆమె మీద లైంగిక దాడి చేశారు.
బాధితురాలు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసుల మీద తనకు నమ్మకం లేదని, ఈ కేసు సీబీఐతో దర్యాప్తు చేయించాలని బాధితురాలు న్యాయస్థానంలో మనవి చేసింది. స్థానిక పోలీసులు నిందితులకు అండగా ఉన్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
కేసు వివరాలు తెలుసుకున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఉదయ్.యు, లలిత్లతో కూడిన ధర్మాసనం వెంటనే స్టేటస్ రిపోర్టు కోర్టులో సమర్పించాలని హర్యానా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా బాధితురాలికి రక్షణ కల్పించాలని పోలీసులకు సూచించారు.