పాలు, చాక్లెట్లు కొనేందుకు వెళ్లారా: అల్లర్లపై సీఎం ముఫ్తీ ఆసక్తికర వ్యాఖ్య
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో నిరసనలకు దిగుతూ, భద్రతాదళాల కాల్పుల్లో మరణించిన వారిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. వారేమీ పాలు లేదా చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి తిరిగి వెళ్లేందుకు రాలేదన్నారు.
నిరసనలు తెలుపుతూ పోలీసుల పైకి రాళ్లు రువ్విన వారికే పెలెట్లు, బులెట్ల గాయాలు అయ్యాయని చెప్పారు. ఆమె బుధవారం ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
2010లో భద్రతాదళాల చర్యల్లో పౌరులు హతమైన సమయంలో తీవ్ర విమర్శలు చేసిన మీరు, ఇప్పుడు అదే తరహా ఘటనలను ఎలా సమర్థించుకుంటారని మీడియా అడిగింది. దానికి ఆమె పైవిధంగా స్పందించారు.
ఆరేళ్ల క్రితం ఫేక్ ఎన్కౌంటర్ జరిగిందని ఆ కారణంగా అల్లర్లు చెలరేగాయన్నారు. ఇప్పుడు మాత్రం నిరసనలను దగ్గరుండి ప్రోత్సహించే వర్గాలు తయారయ్యాయన్నారు. ఆనాడు ప్రాణాలు కోల్పోయిన వారిని, నేడు మరణించిన వారికి పోలికలు లేవని చెప్పారు.
ఆందోళనకారులపై ఆమె విరుచుకుపడ్డారు. 95 శాతం మంది కాశ్మీరులు శాంతిని కోరుకుంటున్నారని, కేవలం ఐదు శాతం మంది మాత్రమే హింసకు పాల్పడుతున్నారన్నారు. 2010 నాటి షోపియాన్ అల్లర్లతో ప్రస్తుత అల్లర్లను పోల్చడం సరికాదన్నారు.
అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి మధ్య ఎంతో తేడా ఉందన్నారు. పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టిన వ్యక్తిని కాల్చడం, నిరసన తెలుపుతూ పాలు తెచ్చుకునేందుకు వెళ్తున్న వ్యక్తిని కాల్చడం మధ్య చాలా తేడా ఉందన్నారు. జూలై నుంచి జరుగుతున్న అల్లర్లలో పాలుపంచుకుంటున్న వారు ఐదు శాతం మంది మాత్రమేనని, వారంతా జాతి వ్యతిరేకులన్నారు. వారి ఆందోళన చట్టబద్ధం కాదన్నారు. చర్చలు కోరుకునే వారు, యువకులను రాళ్లు పట్టుకుని కోరే వారి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందన్నారు.