జయ, శశి అక్రమాస్తుల కేసు విచారణ ఖర్చు ఎంతంటే..?
ఆదాయానికి మించి ఆస్తులు కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్ల విచారణకు కర్ణాటక ప్రభుత్వం రూ.2.36 కోట్లు ఖర్చు చేసింది.
బెంగళూరు: ఆదాయానికి మించి ఆస్తులు కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్ల విచారణకు కర్ణాటక ప్రభుత్వం రూ.2.36 కోట్లు ఖర్చు చేసింది. తమిళనాడునుంచి ఈ కేసు కర్ణాటకకు 2004లో బదిలీ అయ్యింది.
2004 నుంచి 2014 వరకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు, ఇతరాలకు కర్ణాటక ప్రభుత్వం రూ.3.93 కోట్లను విడుదల చేయగా రూ.2.36 కోట్లు ఖర్చయ్యాయని సహ కార్యకర్త ఒకరి అర్జీతో గణాంకాలు వెలుగులోకి వచ్చాయి.
ఖర్చులకు విడుదల చేసిన మొత్తంలో మిగులు నిధులను న్యాయ, హోంశాఖలు తిరిగి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేశాయి. ప్రత్యేక న్యాయస్థానం వద్ద పోలీసు భద్రత, జయలలిత, ఇతర నిందితులు వచ్చి వెళ్లినప్పుడు ఏర్పాటు చేసిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అధికారులు, సిబ్బంది వేతనాలు, ఇతర భత్యాల రూపంలో రూ.90.13 లక్షలను చెల్లించారు.
కాగా, అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తోపాటు ఇళవరసి, సుధాకరణ్లను కర్ణాటకలోని పరప్పన జైలుకు తరలించిన విషయం తెలిసిందే.