టీటీవీ దినకరన్: ఈసీ లంచం కేసు లిస్టులో మంత్రులు! గుండె పోటుతో!
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం ఏకంగా ఎన్నికల కమిషన్ నే కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నించిన టీటీవీ దినకరన్ చుట్టు ఉచ్చుబిగుసుకుంటోంది. ఇప్పటికే దినకరన్ మీడియేటర్ సుఖేష్ చంద్రశేఖర్ నుంచి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు పలు వివరాలు సేకరించారు.
టీటీవీ దినకరన్ కు సహకరించి మీడియేటర్ సుఖేష్ చంద్రశేఖర్ తో ఎవరెవరు మాట్లాడారు ? ఎక్కడ అతన్ని కలిశారు ? అనే పూర్తి వివరాలు సేకరించిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఓ లిస్టు తయారు చేసి దినకరన్ విచారణకు హాజరైన సమయంలో అతని ముందు పెట్టాలని సిద్దం అయ్యారు.
టీటీవీ దినకరన్ కాదు ముందే
ఎన్నికల కమిషన్ అధికారికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులకు అడ్డంగా బుక్కయిన సుఖేష్ చంద్రశేఖర్ చెన్నైలోనే చాల మందితో కలిసి మాట్లాడాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
చెన్నైలో మంతనాలు
చెన్నైలో మకాం వేసిన సుఖేష్ చంద్రశేఖర్ చాల మందితో విడివిడిగా మాట్లాడాడని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆధారాలు సేకరించారు. సుఖేష్ చంద్రశేఖర్ అందరితో చర్చించిన తరువాతే చివరి సారిగా టీటీవీ దినకరన్ తో భేటీ అయ్యారని విచారణ చేస్తున్న అధికారులు అంటున్నారు.
ఆ మంత్రిగారు కలిశారా ?
టీటీవీ దినకరన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకుని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా తన ఇంటి నుంచి నేరుగా నగదు బట్వాడా చేయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ పేరు కూడా ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల లిస్టులో ఉందని సమాచారం.
చెమటలు పడుతున్నాయి
సుఖేష్ చంద్రశేఖర్ పట్టుబడిన తరువాత ఢిల్లీ పోలీసులు కేవలం దినకరన్ పేరు మాత్రమే తెరమీదకు తీసుకు వచ్చారు. అయితే ఇప్పటికే సుఖేష్ చంద్రశేఖర్ ను కలిసిన వారి పేర్లు మొత్తం సేకరించిన పోలీసులు వాటిని బయటపెట్టకపోవడంతో అతనితో సంబంధాలు ఉన్న వారికి గుండెపోటు వచ్చినంత పని అయ్యి చెమలుపడుతున్నాయి.
రూ. 50 కోట్ల డీల్ అంటే తమాషానా ?
ఎన్నికల సంఘంలోని ఓ అధికారికి రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి సాహసం చేసిన టీటీవీ దినకరన్ పెద్దలను సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని పోలీసు అధికారులు అంటున్నారు.
దినకరన్ వెనుక ఎవరున్నారు ?
టీటీవీ దినకరన్ వెనుక తమిళనాడుకు చెందిన పలువురు మంత్రులు ఉన్న తరువాతే ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వడానికి సిద్దం అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు దినకరన్ దెబ్బతో తమిళనాడులోని కొందరు మంత్రులు హడలిపోతున్నారు.
అందరినీ విచారిస్తాం
ఎన్నికల కమిషన్ కు ఎరవేసిన కేసు విచారణ చేస్తున్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దినకరన్ కు సహకరించిన పెద్దలు అందరినీ విచారిస్తామని, ఎవ్వరినీ వదిలిపెట్టమని అంటున్నారు. మొత్తం మీద దినకరన్ చేసిన పనికి ఎంత మంది జైలుకు వెలుతారో వేచిచూడాలి.