ఆటోలో గ్యాంగ్ రేప్: ముగ్గురి అరెస్టు
తిరువనంతపురం: కాలేజ్ యువతిని నమ్మించి తీసుకు వెళ్లి గ్యాంగ్ రేప్ చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని తిరువనంతపురం జిల్లా వార్కాల పట్టణంలో (19) యువతి నివాసం ఉంటున్నది. ఈమె బీఎస్సీ నర్సింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నది.
యువతి స్నేహితుడు షైజు. షైజు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గత మంగళవారం షైజు యువతిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని నమ్మించి కాలేజ్ దగ్గర నుంచి ఆటోలో పిలుచుకుని ఇంటికి వెళ్లాడు. తరువాత మార్గం మధ్యలో సుజిత్, బాబు అనే ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కారు. ఆటోను వార్కాల పట్టణం శివారు ప్రాంతాలకు తీసుకు వెళ్లారు.
తరువాత నిర్జనప్రదేశంలో ఆటో నిలిపి విద్యార్థిని మీద గ్యాంగ్ రేప్ చేశారు. ఆమెకు మూర్చ రావడంతో కుప్పకూలిపోయింది, యువతి మరణించిందని భావించిన నిందితులు ఆమెను అక్కడే వదిలి పరారైనారని వార్కాల ఇన్స్ స్పెక్టర్ వినోద్ చెప్పారు. బాధితురాలు తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి నిందితులను వివరాలు తెలుసుకుని ముగ్గురిని అరెస్టు చేశామని ఇన్ స్పెక్టర్ వినోద్ తెలిపారు. బాధితురాలు వార్కాల ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని ఆయన వివరించారు. నమ్మించి స్నేహితురాలిని పిలుచుకుని వెళ్లి సాటి స్నేహితులతో అత్యాచారం చేసిన షైజును పోలీసులు విచారిస్తున్నారు.