ఐఏఎస్, బ్యాంక్ మేనేజర్ హడల్: ఐటీ దాడులు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సన్నిహితుడైన కావేరీ బోర్డు సీనియర్ ఇంజనీర్ చిక్కరాయప్ప, ఐఏఎస్ సీనియర్ అధికారి మోహన్ చక్రవర్తి, ధనలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ ఉమాశంకర్ ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సన్నిహితుడైన ప్రభుత్వ అధికారితో పాటు ఐఏఎస్, బ్యాంక్ మేనేజర్, ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్లు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఏకకాలంలో దాడులు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
బుధవారం బెంగళూరు నగరంలో నాలుగు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు చేశారు. బెంగళూరులోని సంజయ్ నగరలో నివాసం ఉంటున్న ఐఏఎస్ సీనియర్ అధికారి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు.
ధనలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ ఉమాశంకర్, కావేరీ వాటర్ బోర్డు సీనియర్ ఇంజనీరు చిక్కరాయప్ప ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసి కీలకపత్రాలు పరిశీలించారు. సీఎం సిద్దరామయ్యకు కావేరీ బోర్డు సీనియర్ అధికారి చిక్కరాయప్ప చాల సన్నిహితుడు అనే విషయం అందరికి తెలిసిందే.
ఇక్కడి బాణసవాడిలో చిక్కరాయప్ప నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటిలో స్వాధీనం చేసుకున్న పత్రాలను ఐటీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ధనలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ ఉమాశంకర్ అక్రమంగా ఆస్తులు సంపాంధించారని ఆరోపణలు వచ్చాయి.
బ్యాంక్ మేనేజర్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేసి కీలక పత్రాలు పరిశీలిస్తున్నారు. ఈ నాలుగు చోట్ల జరిగిన దాడుల విషయంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.