బీబీఎంపీ ఎన్నికలు: సుప్రీంలో కాంగ్రెస్ ఆఖరిపోరాటం
న్యూఢిల్లీ/బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికలను వాయిదా వేయించడానికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మీరు ఇచ్చిన తీర్పును మళ్లి పరిశీలించాలని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించింది.
ఆగస్టు 5వ తేది లోపు బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి చెయ్యాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే 2011వ సంవత్సరం రిజర్వేషన్ ల ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
జులై 1వ తేది తరువాత సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వం సమర్పించిన అర్జీని పరిశీలించే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ లు తయారు చేసి బీబీఎంపీ ఎన్నికలు నిర్వహిస్తామని, అందుకు సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించింది.
అయితే ఇప్పటికే ఎన్నికల సంఘం బీబీఎంపీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తు ఆదేశాలు జారీ చేసింది. జులై 28వ తేదిన బీబీఎంపీ పరిధిలోని 198 వార్డుల ఎన్నికలు నిర్వహించాలని, జులై 31వ తేదిన ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తామని ప్రకటించింది. బీబీఎంపీ ఎన్నికలు వాయిదా వేయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఆఖరిపోరాటం చేస్తున్నది.